కమ్మర్పల్లి, సెప్టెంబర్ 11 : యువత బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. దీంతో పాటు యువతకు చేయూత అందించేందుకు అనేక కా ర్యక్రమాలను చేపడుతున్నది. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేయించడమే కాకుండా సొంత ఖర్చులతో వేలాది మంది యువతకు ప్రోత్సాహక కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకా రంతో యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు భోజనం పెట్టి మరీ ఉచిత కోచింగ్ అందించడం, ప్రైవేటు రంగంలో ఉన్న వేలాది ఉద్యోగ అవకాశాలను యువత ముంగిటకే తీసుకు రావ డం, యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు అందజేయడం, మినీ స్టేడియాల్లో సౌకర్యాలు కల్పించడం, ఉన్నత విద్యకు బాటలు వేస్తూ కొత్తగా ప్రభుత్వ కాలేజీలు మంజూరు చేయించడం…ఇలా యువతకు అవసరమైన చేయూత కోణం మంత్రి యువత కోసం చేస్తున్న కార్యక్రమాల్లో మిళితమై ఉంటున్నది.
నియోజకవర్గ యువతకు వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలను దరి చేర్చడం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం చేపట్టిన చక్కని కార్యక్రమం మెగా జాబ్ మేళా. ఈ మెగా జాబ్ మేళా నేడు (మంగళవారం) బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూర్ మండలం లక్కోరా ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. 4000పైగా ఉద్యోగాలతో 70 పైగా కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.సాఫ్ట్వేర్, ఐటీ, మేనేజ్మెంట్, హాస్పిటల్, బ్యాంకింగ్, మార్కెటింగ్, ఫార్మా కంపెనీల్లో ఉన్నత చదువుల వారికే కాకుండా టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించారు.
ప్రభుత్వ రంగంలో వచ్చే విద్యా సంస్థలు పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయని నమ్మే మంత్రి కమ్మర్పల్లిలో యువత, విద్యార్థి సంఘాలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంజూరు చేయించి కల నెరవేర్చారు. బాల్కొండలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అనేది నియోజక వర్గ 71 సంవత్సరాల చరిత్రలో ఎన్నికల హామీగా మిగిలిపోతే దానిని సాకారం చేసి విద్యార్థులకు, భావితరాలకు తరగని మేలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సుమారు లక్షా 32 వేల ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో ఆది లోనే పెద్ద ఎత్తున వచ్చిన నోటిఫికేషన్లతో నియోజక వర్గంలో ప్రిపరేషన్కు దిగిన సుమారు మూడు వేల మందికి పైగా అభ్యర్థులకు చేయూత అందించారు. ఇందులో సుమారు వెయ్యి మందికి వేల్పూర్ మండలం పడగల్లో మంత్రి తన సొంత ఖర్చులతో ఉచిత కోచింగ్ శిబిరంతో పాటు భోజన సౌకర్యం కల్పించారు. ఎక్కడా రాజీ పడకుండా నిష్ణాతులైన ఫ్యాకల్టీలను తెప్పించారు. నిపుణులతో ఆన్లైన్ మెటీరియల్ తయారు చేయించి అందించారు. ఉచితంగా ప్రిపరేషన్ మెటీరియల్ను నియోజకవర్గంలో గ్రంథాలయాలకు అందించారు.
యువత తల్లిదండ్రుల ఆశల ప్రతిరూపాలు యువత. కన్న వారికి చివరి కంటా ఆసరా నిలిచేది యువత. కొత్తగా రెక్కలు తొడిగే అలాంటి యువత భవిష్యత్తు, జీవితానికి వారి స్పీడు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినా వారి బంగారు భవిష్యత్త్తు..వారిని కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సు అందించే కార్యక్రమం చేపట్టారు. నియోజక వర్గంలో 12 వేల మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు చక చకా అందిస్తూ…వాటిని అందించే వేదికలను ఆర్టీఏ, పోలీసు అధికారులతో యువతకు అవగాహనా కల్పించే వేదికలుగా మలుస్తూ వారికి పక్కా డ్రై‘వింగ్స్’ అందిస్తున్నారు.
జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి మండలం..ఉమ్మడి కమ్మర్పల్లి మండలంలోని మానాలలో గిరిజన క్రీడాకారులు, అటు జిల్లా సరిహద్దు మండలమైన ఏర్గట్ల గ్రామాలు, ఇలా ఎందరో క్రీడాకారులు, యువత 40 సంవత్సరాల ఆకాంక్షలను నెరవేరుస్తూ కమ్మర్పల్లిలో మినీ స్టేడియాన్ని అందించారు. వేల్పూర్లో మినీ స్టేడియానికి అవసరమైన అన్ని హంగులు, సౌకర్యాలను అందించి, ఇండోర్ స్టేడియాన్ని నిర్మింపజేశారు. యువత ఉపాధి నైపుణ్యం కోసం ఉపాధి ట్రైనింగ్ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ గుర్తింపు కలిగిన న్యాక్ సెంటర్లు భీమ్గల్, మోర్తాడ్ మండల కేంద్రాల్లో మంజూరు చేయించారు. భీమ్గల్ సెంటర్ ద్వారా వందలాదిమందికి ఉపాధి అవకాశాలను న్యాక్ సర్టిఫికెట్లతో అందించారు. ఇందులో ఎందరో యువతులకు ఉపాధిపరమైన ఆత్మ విశ్వాసం సమకూరింది. మోర్తాడ్ సెంటర్ భవిష్యత్తులో ఇదే ప్రయోజనాలను అందించనున్నది.
వేల్పూర్, సెప్టెంబర్ 11 : వేల్పూర్లో మంగళవారం నిర్వహించనున్న మెగా జాబ్మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాబ్ మేళాకు వచ్చే యువతీ యువకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. 4000 ఉద్యోగాలతో 70 కంపెనీలు వస్తున్నందున ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగావకావాలు కల్పించే జాబ్ మేళా కావడంతో విజయవంతం అయ్యేలా బీఆర్ఎస్ నాయకులు కృషి చేస్తున్నారు. వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలోని ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం రాత్రి పరిశీలించారు. ఏర్పాట్లపై మంత్రి బీఆర్ఎస్ నాయకులకు పలు సూచనలు చేశారు. జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వేముల కోరారు. మంత్రి వెంట ఆర్టీఏ మెంబర్ రేగుళ్ల రాములు, వైస్ ఎంపీపీ బోదేపల్లి సురేశ్ తదితరులు ఉన్నారు.