నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 25: ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి దాసరి హర్ష(24) ఆత్మహత్యతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో విషాదం నెలకొన్నది. వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న అతడు సూసైడ్ చేసుకోవడంతో తోటి విద్యార్థులు, కళాశాల స్టాఫ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే హర్ష అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి దాసరి రాధ శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా.. రాధ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నది. చిన్న కుమారుడు మంచిర్యాల్లో చదువుకుంటుండగా.. పెద్ద కుమారుడు హర్ష(24) 2018లో నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరాడు. మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఫైనలియర్ విద్యనభ్యసిస్తున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి శుక్రవారం రాత్రి భోజనం చేసిన అతడు.. తన 105 నంబర్ గదికి వెళ్లి పడుకున్నాడు. శనివారం పరీక్ష ఉండగా.. ఉదయం అతడు లేవలేదు. దీంతో తోటి విద్యార్థులు గది వద్దకు వెళ్లి పిలిచినా.. డోర్ తీయలేదు. దీంతో వారు గది తలుపులను నెట్టి లోనికి వెళ్లి చూశారు. అప్పటికే అతడు బెడ్ షీట్తో ఉరేసుకున్నా డు. కిందకు దించి చూడగా.. శ్వాస లేకపోవడంతో విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిర, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్కు సమాచారం అందించారు. వారు హాస్టల్కు చేరుకొని విషయాన్ని వన్టౌన్ పోలీసులకు తెలిపారు. వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తోటి విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. ఏడాది కాలంగా వెన్ను పూస నొప్పితో బాధపడుతున్న అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.
హర్ష చాలా తెలివైన విద్యార్థి అని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన పేపర్-1, 2 పరీక్షలు మంచిగా రాశాడని తెలిపారు. అతడు ఆత్మహత్య చేసుకోవడంపై స్టాఫ్తో పాటు తోటి మెడికోలు చాలా బాధపడుతున్నారన్నారు. హర్ష ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లి రాధ నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు చేరుకొని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘ఎంత పని చేశావురా నాని.. నువ్వు గిట్ల చేస్తావని అనుకోలేదు తండ్రి..’ అంటూ రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. తమ కుమారుడు డాక్టర్ అవుతాడనుకున్నామని ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది.