బాన్సువాడ టౌన్, డిసెంబర్ 11: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీదవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి పో చారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 400 బస్తీ దవాఖానలను మంజూరుచేసినట్లు చెప్పారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ చావిడి వద్ద రూ.13 లక్షలతో నిర్మించిన భవనంలో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానను ఆదివారం ఆయన కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణానికి రెండు బస్తీదవాఖానలను మంజూరు చేశారని తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ప్రజలు ప్రతిచిన్నదానికి ఏరియా దవాఖానలకు వెళ్లకుండా, వారికి అందుబాటులో ఉండడానికి బస్తీదవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఇక్కడ రోగులకు వైద్య పరీక్షలు, చికిత్స, అవసరమైన మందులు అన్ని ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఈ దవాఖాన ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దవాఖానలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.
మూడు కోట్లతో పాదచారుల వంతెన నిర్మాణం బాన్సువాడలో రూ.20 కోట్లతో వంద పడకల మాతా శిశు దవాఖానను ఏర్పాటు చేశామన్నారు. ఏరియా దవాఖాన భవనం పాతది కావడంతో అదే స్థలంలో రూ.10 కోట్లతో నూతన భవనం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా, త్వరలోనే మంజూరు చేస్తారని తెలిపారు. ఏరియా దవాఖాన నుంచి మాతా శిశు దవాఖాన వరకు వైద్యులు, రోగులు, సిబ్బంది రాకపోకల కోసం రూ. మూడు కోట్లతో పాదచారుల వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రోగం వచ్చాక ఇబ్బందులు పడుతూ చికిత్స చేయించుకోవడం కన్నా రోగాలు రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమమని, ప్రజలు ఈ దిశగా ఆలోచించాలని కోరారు.
మంచి పనులు చేస్తుంటే కొందరు ఓర్వలేక అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అలాంటి వాటిని నాయకులెవరూ లెక్క చేయవద్దన్నారు. మనం మంచి చేస్తున్నప్పుడు ఎవరికీ భయపడేది లేదన్నారు. ఇకనుంచి ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే తిరిగి అదే పద్ధతిలో వారికి సమాధానం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ శ్రీమతి దోడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, బాన్సువాడ తహసీల్దార్ గంగాధర్, బాన్సువాడ విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్యలు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.