Gurukul Teacher | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): అడ్మిషన్ల కోసం ఇప్పటికే మైనారిటీ గురుకులాల టీచర్లను ఒత్తిడికి గురిచేస్తున్న ప్రభుత్వం.. ఇదే కోవలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. గురుకుల ఉపాధ్యాయులు రాత్రివేళ రెండు గంటలపాటు విద్యార్థుల వసతి గృహాలతోపాటు వాష్రూమ్లు, ఇతర పరిసరాలను పర్యవేక్షించాలని నిర్దేశించింది. ఈ మేరకు గురువారం మైనారిటీ గురుకులాల సెక్రటరీ సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సర్కార్ నిర్ణయంపై ఉపాధ్యాయ వర్గాల్లో దుమారం రేగుతున్నది. పాఠాలు బోధించే తమకు బాత్రూమ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఉపాధ్యాయులమా? వాచ్మెన్లమా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో విధులు నిర్వర్తించే అధ్యాపకులు, టీచర్లు అదనపు భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీరు విద్యాసంబంధ, ప్రత్యేక విధులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బోధనలో భాగంగా పాఠాలు చెప్పడం, నోట్స్, వర్క్షీట్స్, టెస్ట్లు రూపొందించడంతో మూల్యాంకనం, తరగతి గదుల పర్యవేక్షణ, పేరెంట్స్ మీటింగ్, రికార్డులు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ డ్యూటీల్లో భాగంగా రాత్రివేళ హాస్టళ్ల పర్యవేక్షణ, అదనపు తరగతి గదులు నిర్వహించాలి. వార్డెన్ల కొరత కారణంగా వారి పనులు కూడా టీచర్లే చేయాల్సి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాష్రూమ్లను సర్కార్ పర్యవేక్షించాలని ఆదేశించడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన తమకు సంబంధంలేని డ్యూటీలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది పవిత్రమై బోధనా వృత్తిని అవమానించడమేనని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విదాలయాల్లో అడ్మిషన్లు 50 శాతం దాటకుంటే సంబంధిత మైనారిటీ గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రెండు నెలల క్రితం ఓ సర్క్యులర్ జారీచేశారు. టీచర్ల పనితీరు పర్యవేక్షణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన రిసోర్స్ పర్సన్లకు అప్పగించారు. దీంతో వారు ఉపాధ్యాయులపై బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రాత్రివేళల్లో విధులు నిర్వర్తించే టీచర్లు.. రోజూ రెండు గంటలపాటు వాష్రూమ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ హక్కులను ప్రభుత్వం హరిస్తున్నదని గురుకుల ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మండిపడుతున్నారు. పాఠాలు బోధించాల్సిన వారికి సంబంధంలేని విధులు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో విద్యాప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ నిర్ణయం ఉపాధ్యాయుల గౌరవమర్యాదలకు భంగకరమని పేర్కొన్నారు. వెంటనే అసంబద్ధ, వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.