దశాబ్దాల కల సాకారమైంది. కామారెడ్డిలోని వైద్య కళాశాల కార్యాచరణలోకి వచ్చింది. గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. కొత్త బంగారు లోకంలోకి విద్యార్థులు కొండంత ఆశతో అడుగు పెట్టారు. అధ్యాపకులు, కళాశాల సిబ్బంది వారికి పూలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సకల వసతులతో కాలేజీ అందుబాటులోకి వచ్చిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు సూచించారు. తొలిరోజు కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఎంబీబీఎస్ చదవాలన్న తమ స్వప్నం సాకారమైందని వారు మురిసిపోయారు. తమ కష్టానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోడు కావడం తోనే మెడిసిన్ చదివే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోఎంతో మంది విద్యార్థులకు డాక్టర్లు అయ్యే భాగ్యం దక్కిందని, వారంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
‘మనిషి ప్రాణం కాపాడితే వచ్చే ఆనందం.. కోట్లు ఖర్చు పెట్టినా రాదు.. పవిత్ర వృత్తిలో ఎదిగేందుకు వచ్చిన అవకాశాన్ని సఫలీకృతం చేసుకోవాలి..’ వైద్యుడు దేవుడితో సమానమనే మాటను నిజం చేసేలా తయారుకావాలంటూ తొలి రోజు పాఠాలను ప్రారంభించారు కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు, ప్రొఫెసర్లు. మొదటి రోజు తరగతులకు వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు గులాబీ పూలను అందజేసి స్వాగతం పలికారు.
కామారెడ్డి, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చేరిన వైద్య విద్యార్థులు తొలి రోజు తరగతులకు ఉత్సాహంగా హాజరయ్యారు. మొదటిరోజు కళాశాలకు వచ్చిన విద్యార్థులు, ప్రొఫెసర్లకు గులాబీ పూలను అందజేసి స్వాగతం పలికారు. తొలిరోజు తరగతులకు 60మంది వైద్య విద్యార్థులు, 50మందికి పైగా వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కామారెడ్డి మెడికల్ కళాశాలలో అన్నిరకాల వనరులు ఉండడంతో తరగతులు ప్రారంభించామన్నారు. గతంలో మెడికల్ సీటు లభించాలంటే ఎన్నో కష్టాలు పడేవారని, ఇప్పుడు అతి సులువుగా మెడికల్ సీటు లభించిందని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో పేదలకు వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్య కళాశాల తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మొదటి వారం రోజులపాటు ఫౌండేషన్ కోర్సు నిర్వహించనున్నారు. అనంతరం జనరల్ బోధన ప్రారంభించనున్నారు.
కాలేజీల పెంపుతోనే సొంత జిల్లాలో సీటు..
కామారెడ్డిలోనే మెడికల్ సీటు వస్తుందని అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. గతంలో మెడికల్ సీటు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకవేళ వచ్చినా ఇతర జిల్లా, ఇతర రాష్ర్టాల్లో సీటు దొరికేది. తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో నాకు సొంత జిల్లాలోనే మెడికల్ సీటు వచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నా చదువు
మొత్తం ఇక్కడే పూర్తిచేసే అవకాశం దక్కింది.
– శ్రీహిత, కామారెడ్డి
కాలేజీల పెంపుతో ఈజీగా సీ టు ..
గతంలో ఎంబీబీఎస్ కోసం నీట్ రాసినా సీటు వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా ఎక్కడో వేరే రాష్ట్రంలో వచ్చేది. పోటీ చాలా ఉండేది. ఇప్పుడు సీఎం కేసీఆర్..జిల్లాకో మెడికల్ కళాశాల ప్రారంభించడంతో చాలా ఈజీగా సీటు లభించింది. మొదటిరోజు తరగతికి హాజరుకావాలనే ఉద్దేశంతో దూరమైనా వచ్చాను.
– అక్షిత, నల్గొండ
చాలా ఆనందంగా
వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎంతో ఉత్సాహంతో మొదటి రోజు తరగతులు ప్రారంభమయ్యాయి. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. గతంలో మెడికల్ సీటు రావాలంటే ఎంతో కష్టపడ్డా వచ్చేది కాదు. సీఎం కేసీఆర్ కృషితో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో చాలా సులభంగా సీటు వచ్చింది. వంద కిలోమీటర్ల పరిధిలోని కామారెడ్డి కళాశాలలోనే సీటు లభించడం చాలా సంతోషంగా ఉన్నది.
– సిరి, మేడ్చల్
75 మంది సిబ్బంది నియామకం…
కామారెడ్డి మెడికల్ కళాశాలలో 10 మంది ప్రొఫెసర్లు.. అందులో 7 రెగ్యులర్, 2 కాంట్రాక్ట్, ఒకరు ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. వీరితోపాటు 27మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించగా అందులో 25మంది రెగ్యులర్, ఇద్దరు కాంట్రాక్ట్, ఐదుగురు సీనియర్ రెసిడెంట్, ఐదుగురు హౌస్ సర్జన్లు ఉన్నారు. త్వరలో మరో 20మంది సీనియర్ రెసిడెంట్లు రానున్నారు. ఇప్పటికే ప్రిన్సిపాల్తోపాటు 26మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు ఉన్నారు. మెడికల్ కళాశాలలో అనాటమీ(1), సైకాలజీ(1), బయోకెమిస్ట్రీ(1), మైక్రో బయాలజీ(1), ఫోరెన్సిక్ మెడిసిన్ (1), జనరల్ మెడిసిన్(1), రేడియో డయాగ్నోస్టిక్(1), జనరల్ సర్జరీ(4), ఆర్థోపెడిక్స్ (2), ఈఎన్టీ(1), ఓబీజీ(3), అనస్తీషియా(3) పోస్టులు భర్తీకానున్నాయి.
అన్ని సౌకర్యాలు కల్పించాం..
కామారెడ్డి మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాం. మొదటిరోజు తరగతుల ప్రారంభం సందర్భంగా 60మందికి పైగా వైద్య విద్యార్థులు హాజరయ్యారు. త్వరలో మిగతా విద్యార్థులు కూడా పాల్గొంటారు.
-వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్, కామారెడ్డి మెడికల్ కళాశాల
డాక్టర్ కోర్సు చేస్తానని అనుకోలేదు..
గతంలో నీట్ రాసినప్పటికీ.. పోటీవల్ల సీటు లభించలేదు. దీంతో నేను డాక్టర్ కోర్సు చేస్తానని అనుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో కామారెడ్డి మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. దీంతో డాక్టర్ చదవాలన్న కోరిక నెరవేరుతున్నది.
– వినయ్ కుమార్, ఆర్మూర్