నిజాంసాగర్, జూన్ 18 : రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అంగన్వాడీలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నది. వారికి సంపూర్ణ ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతో భోజ నం అందిస్తున్నారు. గతంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో సైతం సన్నబియ్యంతో పెట్టాలని నిర్ణయించినా సాంకేతిక కారణాలతో వాయిదా పడిం ది.
ఇటీవల నూతన సచివాలయం ప్రారంభోత్సవం సం దర్భంగా అంగన్వాడీ కేంద్రా ల్లో సైతం సన్నబియ్యంతో భోజనం అందించాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
హర్షం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు
అంగన్వాడీ కేంద్రాల్లో సైతం సన్నబియ్యంతో భోజనం అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుండడంతో గర్భిణులు, బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తినేందుకు గర్భిణులు, బాలింతల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ అంగన్వాడీ సిబ్బంది తెలుపుతున్నారు. సన్నబియ్యంతో భోజనం అందించడంతో కేంద్రాలకు వచ్చేందుకు ఆకర్షితులవుతారని, దీంతో అంగన్వాడీ కేంద్రాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య లక్ష్మి పథకం ఇలా
గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో సంపూర్ణ మధ్యాహ్న భోజనం పెడతారు. అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డుతో కూడిన భోజనంతోపాటు 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తారు. కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు సైతం మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఐదు ప్రాజెక్టులు, 1,193 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 7661 మంది గర్భిణులు, 64,714 చిన్నారులు ఉన్నారు.
సన్నబియ్యంతోనే భోజనం చేస్తా
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తున్నారు. దొడ్డుబియ్యంతో అన్న వండడంతో తినేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ప్రతిరోజూ సన్నబియ్యంతో భోజనం అందించాలనే నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సన్నబియ్యంతోనే భోజనంచేస్తాం.
– వెన్నెల, గర్భిణి, మహ్మద్నగర్
ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలోనే భోజనం చేస్తా
అంగన్వాడీ కేంద్రంలో దొడ్డు బియ్యంతో భోజనం అందించడంతో పాలు, గుడ్డుతోనే సరిపెట్టుకునే దానిని. దొడ్డు బియ్యంతో భోజనం అందించడంతో సరిగా తినలేకపోయాం. సన్నబియ్యంతో భోజనం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆలోచన చక్కగా ఉంది. ఇక నుంచి ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలోనే భోజనం చేస్తాను. – రసూల్బీ, బాలింత, మహ్మద్నగర్