నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం లో అవినీతి బాగా పెరిగిపోయింద ని, అయినా పట్టించుకునేవారే కరువయ్యారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ ధోరణితో ప్రజా, రైతు, కార్మిక అభ్యున్నతిని పూర్తిగా విస్మరించి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాలకు ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.20కోట్ల నిధులతో నిజామాబాద్ రూరల్ మండలంలోని బోర్గాం(పీ), మాధవ్నగర్, పాంగ్రా, గూపన్పల్లి, కాలూర్, ఖానాపూర్, సారంగాపూర్ గ్రామాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ జగన్మోహన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్తో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఆయా కార్యక్రమాల్లో బాజిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి చేయాలనే ధ్యాసను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయి కుట్రలు, డబ్బులు ఎరజూపి ఎనిమిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చిందని మండిపడ్డారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఎమ్మెల్యేలు విఫలం చేశారని గుర్తుచేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు వాటి ఊసేత్తడం లేదని విమర్శించారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే అసత్యాలపై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రహించి బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు.
కాళేశ్వరం ద్వారా 52 లక్షల ఎకరాల బీడు భూమును సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్ర ప్రజలు, రైతులు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలకు రూ.42కోట్లు, సీఎంఆర్ఎఫ్ కింద రూ.20 కోట్లు మంజూరు చేశామని, 75 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. వీటితోపాటు ప్రతి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు.
అభివృద్ధిని పట్టించుకోని ఎంపీ అర్వింద్..
అర్వింద్ ఎంపీగా గెలిచి నాలుగేండ్లు గడుస్తున్నా జిల్లా అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఏటా ఎంపీ కోటా కింద మంజూరయ్యే రూ. ఐదు కోట్లు ఏం చేస్తున్నాడని, గ్రామాల అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుమలతా గోపాల్రెడ్డి, ఎంపీపీ అనూషా ప్రేమ్దాస్, కార్పొరేటర్లు శ్రీనివాస్రెడ్డి, లలితా గంగాధర్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ కన్వీనర్ దేవేందర్, నుడా డైరెక్టర్ సంతోష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్రావు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.