నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రామ, మండల, జిల్లాపరిషత్, మున్సిపల్ సమావేశాల్లో సమావేశాలు నిర్వహించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
కలెక్టర్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరుల పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో, న్యూ అంబేడ్కర్ భవన్లో, మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, నగర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరుల త్యాగాల ఫలితం, సీఎం కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైందని ఎమ్మెల్యే బిగాల అన్నారు.