భిక్కనూరు,ఫిబ్రవరి 2: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రామస్తులు పలువురు గురువారం రాత్రి ఆక్రమించుకున్నారు. కొంతమంది సామగ్రితోపాటు ఇండ్లలోనికి చేరగా, మరికొందరు ఇండ్లకు తాళాలు వేశారు. 44వ జాతీయ రహదారి నుంచి పెద్దమల్లారెడ్డికి వెళ్లేదారిలో బస్వాపూర్, సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామాల నిరుపేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం 50 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది.
గురువారం రాత్రి బస్వాపూర్ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు చేరుకొని అక్రమంగా ప్రవేశించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శివప్రసాద్ శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఖాళీ చేయించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించక ముందే ప్రవేశాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇండ్లను ఆక్రమించిన వారిని ఖాళీ చేయించి తాళాలు వేయించారు. లబ్ధిదారులను త్వరలోనే ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని చెప్పారు.