రాజంపేట్, మే 24: మండలంలోని పలు గుట్ట తండాలోని పలు ఇండ్లకు విద్యుత్ సరఫరా కావడంతో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు.. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని సేదతీరె సమయంలో గ్రామంలోని పలు నివాసగృహాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఇంటి గోడలతోపాటు ఇంట్లోని వస్తువులకు సైతం విద్యుత్ సరఫరా కావడంతో కేకలు వేస్తూ బయటికి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వీపుభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తండావాసులు వెంటనే కొండాపూర్ సబ్స్టేషన్ను ముట్టడించి విద్యుత్ సిబ్బందిని నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సిబ్బంది ప్రమాదానికి కారణాన్ని కనిపెట్టేందుకు శ్రమించారు.ఓ ఇంటి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ రావడంతో ఈ సమస్య తలెత్తిందని గుర్తించి పరిష్కరించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.