Nizamabad | వినాయక్ నగర్, నవంబర్ 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఏసీల తో పాటు విలువైన డాక్యుమెంట్లు కాలి బూడిదైపోయాయి. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో గ్రామీణ బ్యాంక్ లో లోపలి నుండి దట్టమైన పొగలతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. విషయం తెలుసుకున్న నగర సీఐ శ్రీనివాస్ రాజు, మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తమ సిబ్బందితో కలిసి హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది సైతం అక్కడికి చేరుకొని బ్యాంకు లోపల నుండి భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఎవరు కూడా బ్యాంకు లోపలికి వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. సుమారు రెండు గంటల పాటు ఫైర్ ఇంజన్ల ద్వారా సిబ్బంది శ్రమించి మంటలను నియంత్రించారు. బ్యాంకు అధికారులు సిబ్బంది సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు బ్యాంకు లోపల ఉన్న విలువైన డాక్యుమెంట్లను బయటకు తీయించేందుకు యత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పి వేసిన అనంతరం పోలీసులు, బ్యాంకు సిబ్బంది లోనికి వెళ్లి పరిశీలించారు.
అప్పటికే బ్యాంకులో పని వస్తువులన్నీ కాళీ బూడిదైపోయాయి. ఈ ప్రమాదంలో 25 కంప్యూటర్లు, 7 ఏసీ లతో పాటు పలు విలువైన డాకుమెంట్స్ సైతం కాలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ అగ్ని ప్రమాద ఘటన పై బ్యాంకు మేనేజర్ వారణాసి రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లుగా మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు వెల్లడించారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేక ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.