మాచారెడ్డి, నవంబర్ 5: దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు నాలుగు మాత్రమే ఉండగా స్వరాష్ట్రంలో ప్రస్తుతం 204 ఉన్నాయని, ఇప్పటివరకు వాటి మీద రూ.3200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. మైనారిటీలు విదేశీ విద్యనభ్యసించడానికి ప్రభుత్వం రూ.30లక్షలు ఇస్తున్నదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం బడ్జెట్లో కేటాయించనంతగా తెలంగాణ ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించి మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్నదని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్రం ముందున్నదని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, ఆయనకు ముస్లిములంటే పడదని అన్నారు. బీజేపీని గెలిపించడానికే రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడని, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన రేవంత్ ముమ్మాటికీ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తాడని అన్నారు. కామారెడ్డి నుంచి రేవంత్రెడ్డిని తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ముస్లింలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ముస్లింను హోంశాఖ మంత్రి, మరో ముస్లిం సోదరుడు ముజీబుద్దీన్ను ఉర్దూ అకాడమీ చైర్మన్గా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని అన్నారు. ముస్లింలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశం చూపు కామారెడ్డి మీద ఉన్నదని, సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ప్రాధాన్యత సంతరించుకున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని, రాబోయే కాలంలో కామారెడ్డి దశ మారనున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో షాదీఖాన కోసం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని ముస్లిములు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి దాదాపు 200మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, అబ్దుల్ సోహెల్, ఎంజీ వేణు, నల్లవెల్లి అశోక్, జమీర్, మాజిద్, ముస్తాక్హుస్సేన్, షేక్ అజీజ్, అబ్దుల్ఖాన్, అజీజ్,సలీం, మునీర్ పాల్గొన్నారు.