మెండోరా, జూన్ 29: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్చి 1వ తేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎస్సారెస్పీ దిగువన ఉన్న గ్రామాలు, ఆయకట్టుకు తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు.
బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు పాల్గొని ఈ తీర్పును అమలుచేయాలి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గేట్లను ఎత్తివేయాలి. కానీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆ సమయంలో వెళ్లడం కుదరకపోవడంతో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీటి విడుదల చేపట్టిన సమయంలో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఎస్సారెస్పీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు తమ వలలను ఇతర సామగ్రి ఒడ్డుకు చేర్చుకోవాలని సూచిస్తున్నారు. పశువులు నీటిని తాగడానికి గోదావరిలోకి వెళ్లకుండా మేతకు వెళ్లకుండా చూసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలకు అధికారులు కోరారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 553 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 50 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1064.90 అడుగుల (20.068 టీఎంసీలు) వద్ద ఉన్నదని తెలిపారు.