బీర్కూర్, మార్చి 11 : మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవార్లు, శ్రీవారికి సభాపతి పోచారం మనవరాలు స్నిగ్ధారెడ్డి-రోహిత్రెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు.
అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ ఎత్తామన్నారు. ఈ జన్మలో కూడా పుణ్యం చేసుకుంటే మరో జన్మ ఉండదని అన్నారు. ప్రతి ఒక్కరూ పాపాల జోలికి పోకుం డా సన్మార్గంలో నడువాలని సూచించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామితోపాటు సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతవాసులందరం రుణపడి ఉంటామని అన్నారు. తాను కోరడమే ఆలస్యం.. సీఎం కేసీఆర్ తె లంగాణ తిరుమల దేవస్థానం కోసం ఒకసారి రూ.13 కోట్లు, మరోమారు 3 రూ.కోట్లు, ఇటీవల రూ.10 కోట్లు మంజూరు చేశారన్నారు. వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం బాన్సువాడ కాదని, భక్తివాడగా మారిపోయిందన్నారు.
-త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చేపట్టే యాగాలు, కల్యాణాలు లోక కల్యాణం కోసమేనని త్రిదండి దేవానాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. కలియుగదైవం శ్రీమన్నారాయణుడు అందరి ఆత్మలో ఉన్నాడని, ఆయనను పూజించేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగవని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి-ప్రేమల, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి-సోనీరెడ్డి, దొడ్ల వెంకట్రాంరెడ్డి-అరుణ దంపతులు, పోచారం సురేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ, బీర్కూర్ ఎంపీపీలు దొడ్ల నీరజ, తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీలు స్వరూప, శంకర్పటేల్, ఏఎంసీ చైర్మన్లు ద్రోణవల్లి అశోక్, పాత బాలకృష్ణగుప్తా, తిమ్మాపూర్ సర్పంచ్ కొరిపెల్లి రామకుమారి, ఎంపీటీసీలు ఢీకొండ సావిత్రి, సందీప్పటేల్, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు, ద్రోణవల్లి సతీశ్, భోగవల్లి అప్పారావు, పెర్క శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.