ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన ఆహారమే తినాలి. సంప్రదాయ సాగు పద్ధతులకు జీవం పోస్తూ పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాడీ రైతు. రసాయనిక ఎరువులతో నేలసారం కోల్పోవడంతోపాటు దిగుబడులు సైతం తగ్గుతున్నాయి. దిగుబడి పెంపు కోసం వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులే ప్రస్తుతం వరిసాగులో కష్టాలకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. ప్రకృతి వ్యవసాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అద్భుతమైన దిగుబడిని సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జక్రాన్పల్లి మండలం చింతలూర్కు చెందిన చిన్న గంగారాం (చిన్ని కృష్ణుడు).
-జక్రాన్పల్లి, ఫిబ్రవరి 9
దిగుబడి పెంపుదల, తెగుళ్ల నివారణ పేరుతో రైతులు అవలంబిస్తున్న పద్ధతులు, వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు వరిసాగు కష్టాలకు కారణమవుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. కాలక్రమేనా సంప్రదాయ సాగు పద్ధతులన్నీ కనుమరుగైపోవడం, రసాయన ఎరువుల వాడకం పెరిగిపోవడంతో నేలసారాన్ని కోల్పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు రసాయన ఎరువులను ఏ మోతాదులో వాడాలన్న విషయంపై సరైన అవగాహన లేకపోవడం ఇందుకు కారణమవుతున్నది. వీటిని ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ పంట తీయొచ్చనే అపోహ వారిలో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో ఒకవైపు దిగుబడి తగ్గిపోతున్నా రైతులు ఈ తరహా సాగు విధానాలకు స్వస్తి చెప్పకపోవడం గమనార్హం.
దేశవ్యాప్తంగా పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయంతో అద్భుతమైన దిగుబడిని సాధిస్తూ తోటి రైతులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన నాగుల చిన్నగంగారాం(చిన్నికృష్ణ) ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వ్యవధిలో చేతికొచ్చే వంగడాలను పండిస్తున్నాడు. ఇదే క్రమంలో రైతునేస్తం పురస్కారానికి ఎంపికై తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నాగుల చిన్నగంగారాం(చిన్నికృష్ణుడు) 2007లోనే తన అర ఎకరం భూమిలో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలో నేచర్ ఫార్మింగ్పై పట్టు సాధించిన గంగారాం ప్రస్తుతం 3 ఎకరాల విస్తీర్ణంలో అదే పద్ధతిలో దాదాపు 110 రకాల వంగడాలను సాగు చేస్తున్నారు.
దేశీవాళీ వరి విత్తనాలను సేకరించి పాత కాలపు పద్ధతిలో మాత్రమే పంటను పండిస్తున్నాడు. ఆయన దగ్గర్నుంచి 8 రాష్ర్టాలకు చెందిన రైతులు విత్తనాలను తీసుకెళ్తుంటారు. కాగా ఆయన సాగు చేస్తున్న రకాలన్నీ దాదాపు 80 నుంచి 200 రోజుల్లోపే పంట చేతికందుతుండడం విశేషం. అంతేగాకుండా పోషకాలు పోకుండా మిల్లు ద్వారా పట్టించిన కిలో బియ్యం రూ.80 నుంచి 130 వరకు విక్రయిస్తున్నాడు. కాగా 2020 డిసెంబర్ 16న ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా రైతు నేస్తం పురస్కారాన్ని అందుకున్నారు.
భూమి సారవంతం..
ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమవుతుంది. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను పెంచి భూమిని సారవంతం చేస్తుంది. సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేసే వ్యవసాయంతో భూగర్భజలమట్టం కూడా పెరుగుతుంది. నేలలో గట్టిదానం ఉండడంతో గాలికి, వర్షానికి వరి అడ్డం పడకుండా నిలబడి ఉంటుంది.
ప్రకృతి ఎవుసం చేసే పద్ధతి…
ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులు మొదటగా సాగు చేయాలనుకుంటున్న వంగడాలను సిద్ధం చేస్తుకోవాలి. దుక్కి సిద్ధం చేసుకున్న తర్వాత ఎకరానికి 50కిలోల పల్లి పిండి, 50 కిలోల వేప పిండిని కలిపి పొలంలో చల్లుకోవాలి. అనంతరం వడ్ల గింజలను ఎదపెట్టే యంత్రం సాయంతో నాటుకోవాలి. దీంతో పంటకు మొదట డోస్గా సేంద్రీయ ఎరువు అందుతుంది. అనంతరం పంట కొలత మేరకు దుబ్బ పోసి ఆరోగ్యకరంగా ఎదుగుదల ప్రారంభమవుతుంది. మధ్యలో పంటకు ఏవైనా రోగాలు వస్తే దానికి జీవామృతం పిచికారీ చేయాలి.
పురస్కారమందుకున్న చిన్నికృష్ణుడు..
రైతునేస్తం మాసపత్రిక ద్వారా ఏటా తెలుగు రాష్ర్టాల్లోని ఉత్తమ రైతులకు రైతునేస్తం పురస్కారాన్ని అందజేస్తారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు మేరకు ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ చిన్నికృష్ణుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన జీవితం..
పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి మాత్రమే ఈ రోజుల్లో అత్యంత ధనవంతుడు. అందుకోసమే నేను మొట్టమొదటగా అర ఎకరంతో మొదలుపెట్టి ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను. ఇది కేవలం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పని. ప్రజలు రసాయనిక ఎరువులు వాడిన బియ్యాన్ని వండుకుని తినే ఆ ఆహారంలో పోషక విలువలు శరీరానికి మేలు చేసే విటమిన్లు లేకపోవడం అత్యంత బాధాకరం. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
– నాగుల చిన్నగంగారాం(చిన్నికృష్ణుడు)