పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది.
-నిజామాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
Kamareddy | సరిహద్దు ప్రాంతమైన జుక్కల్, బాన్సువాడలో దేశీదారు విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం బాన్సువాడలోని ఓ బార్లో హైదరాబాద్ వైన్ షాపునకు చెందిన ఓ మద్యం బాటిల్ బయట పడింది. నిబంధనల మేరకు ఏ ప్రాంతానికి కేటాయించిన బాటిళ్లను అక్కడే విక్రయించాలి. ఒక మద్యం షాపులో డంప్ చేసిన సరుకును ఇతర దుకాణాల్లో విక్రయించడం ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు.
ఈ వ్యవహారంపై కొంతమంది ఫిర్యాదులు చేసినప్పటికీ కంటి తుడుపు చర్యగానే ఎక్సైజ్ శాఖ కొట్టి పారేసినట్లుగా తెలుస్తోంది. వెరిట్ యాప్ ద్వారా బాటిల్ సమాచారాన్ని గుర్తించినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా చేతులు ఎత్తేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక బాన్సువాడకు చెందిన ఓ అధికార పార్టీ నేత ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే చర్యలకు ఆబ్కారీ శాఖ వెనుకాడుతుండడం అక్రమార్కులకే వంత పాడుతున్నట్లు సమాచారం.
బాన్సువాడలో లైసెన్స్డ్ బార్ నడుపుతున్న ఓ రాజకీయ నాయకుడి తీరు తీవ్ర వివాదస్పదమవుతున్నది. ఈ మధ్యనే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న సదరు నాయకుడు తనను అడిగే వారెవ్వరూ అన్నట్లుగా ఇష్టారాజ్యంగా సమయపాలన పాటించకుండా బార్ను నడుపుతున్నా ఎక్సైజ్ శాఖ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అధికార పార్టీ నేతల జోక్యం మూలంగా సమయ పాలన మించినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖతోపాటు పోలీసులు సైతం వంత పాడి అక్రమార్కులకు సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా నడిచే మద్యం షాపుల తీరుపై ఎస్పీ సింధూ శర్మ సీరియస్గా ఉన్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం పోలీసుల పాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు బాన్సువాడలోని వైన్ షాపులు, బార్ నిర్వహణ తీరే నిదర్శనంగా నిలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపించడంతో మద్యం ఏరులై పారడం సర్వసాధారణం. ఇందులో ఆయా రాజకీయ పార్టీలు మద్యాన్ని పంపిణీ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నది.
తక్కువ ఖర్చుతో మద్యం పంపిణీ చేసి చేతులు దులుపుకోవాలని కొంత మంది ఆలోచన చేస్తుండగా వీరంతా దేశీదారు మద్యంపై ఆధారపడినట్లు అర్థమవుతోంది. తెలంగాణ సర్కారు ద్వారా కొనుగోలు చేసే మద్యం ఖర్చుతో అంతకు రెండింతలు దేశీదారు కొనుగోలు చేయవచ్చనే కుటిలఆలోచనలతో చాలా మంది ఈ ప్రయత్నాలకు ఒడిగడుతున్నట్లు సమాచారం. ఇందుకు ఎక్సైజ్ శాఖకు చెందిన వారే సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం దుకాణాల్లో గుట్టుగా ఇతర రాష్ర్టాలకు చెందిన మద్యం అమ్మకాలు సైతం జరుగుతున్నాయని మద్యంప్రియులు ఆరోపిస్తున్నారు. మన రాష్ట్రంలో లభించే చీప్ లిక్కర్ ధర కన్నా మహారాష్ట్రలోని దేశీదారు తక్కువకు లభిస్తుండడంతో అక్కడి నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖకు సమాచారం ఉన్నప్పటికీ తనిఖీలు, దాడులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచ్చలవిడిగా దేశీదారు ఏరులై పారుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
గతంలో దేశీదారుపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపి అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం తెర వెనుక కొంత మంది వ్యక్తులు అంతా తామై వ్యవహరిస్తూ దేశీదారుకు దారులు తెరిచినట్లుగా స్పష్టం అవుతోంది. మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, పిట్లం, బిచ్కుంద, బీర్కూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ మండలాల్లో దేశీదారు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వైఫల్యం మూలంగా దేశీదారుతో స్థానిక ప్రజానీకం ఒళ్లును గుల్ల చేసుకుంటోంది. దేశీదారు తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నాణ్యత ఉండకపోవడంతో మద్యం ప్రియుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. కానీ తమ జేబులు నింపుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది.