లింగంపేట, మార్చి 2 : మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. ఇంటి వద్ద అనిత భర్త రామకృష్ణ ఉన్నాడు.
రామకృష్ణకు చెవులు వినపడక పోవడంతో పాటు మాటలు సరిగా రావు. అనిత ఊరికి వెళ్లే సమయంలో బీరువాలోని లాకర్లో బంగారు గుండ్లు, వెండి కడియం, ఉంగరాలు పెట్టి వెళ్లింది. అనిత తిరిగి 28వ తేదీని ఇంటికి తిరిగి వచ్చింది. బీరువా తెరిచి చూడగా లాకర్ పగులగొట్టి ఉండడాన్ని గమనించిన అనిత.. లాకర్లో పెట్టిన అభరణాలు కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లాకర్ పగుల గొట్టి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా మండల కేంద్రానికి చెందిన కుమ్మరి ప్రశాంత్ అనే యువకుడు చోరీకి పాల్పడినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడి నుంచి బంగారు గుండ్లు, వెండి ఉంగరాలు, కడియం స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.