బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో పుల్ జోష్లో ఉన్నాడు. విలక్షణమైన, పవర్ ఫుల్ నెగిటివ్ రోల్స్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల సినిమాల్లో విలన్గా మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనతో కలిసి నటించిన పలువురు దక్షిణాది అగ్ర కథానాయకులు వరుసగా రాజకీయాల్లోకి వెళ్లి కీలక పదవుల్ని కైవసం చేసుకోవడంపై బాబీ స్పందిస్తూ…‘నాతో కలిసి తెర పంచుకున్న దక్షిణాది నటులంతా మంత్రులుగా, అగ్ర రాజకీయ నాయకులుగా మారుతున్నారు. ఇది నిజంగా చాలా విచిత్రమైన, సరదాగా అనిపించే విషయం’ అంటూ వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంగా తాను నటించిన సినిమాలను, అందులోని తోటి స్టార్లను గుర్తు చేసుకుంటూ, టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయాన్ని గుర్తుచేశాడు. బాలయ్య చాలా ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం విశేషమని కొనియాడాడు. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లులో కూడా తాను భాగమయ్యానని చెప్పుకొచ్చిన డియోల్ ఆ సినిమా తరువాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారని వివరించాడు.
ఇక తమిళనాడు సీఎం, తళపతి విజయ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ మూవీ జన నాయగన్లో కూడా బాబీ డియోల్ విలన్గా నటించాడు. విజయ్ గురించి మాట్లాడుతూ.. ‘విజయ్కి ఎకువగా హంగామా చేయడం, ప్రచారం చేసుకోవడం అస్సలు నచ్చదు. నా స్వభావం కూడా దాదాపు అలాంటిదే. కానీ ఆయన ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో రాజకీయాల్లో సత్తా చాటారు’ అని సరదాగా చమతరించాడు.
మరోవైపు తమిళ హీరో సూర్యతో కలిసి నటించిన కంగువా చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినప్పటికీ, ఆ ప్రాజెక్ట్లో పనిచేయడం ఒక మంచి అనుభవంగా మిగిలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలన్నీ కేవలం నవ్వుకోవడానికి, సరదాగా అన్నవేనని, ఎవరినీ ఉద్దేశించి సీరియస్గా అనలేదని నవ్వుతూ బాబీ డియోల్ స్పష్టం చేశాడు. ఏది ఏమైనా సౌత్ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీపై బాబీ డియోల్ చేసిన ఈ కామెంట్స్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.