ఖలీల్వాడి/వినాయక్నగర్, మార్చి 3: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్వీయ రక్షణపై విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనత సాధించి, లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నది. జిల్లా పోలీసుశాఖ సహకారంతో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వీయ రక్షణ (తైక్వాండో)పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినులతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు పాల్గొని రికార్డు సృష్టించారు.
ఏకకాలంలో 11వేల మంది శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి ‘లిమ్కా బుక్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నారు. విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు, శిక్షణ తరగతులు ముగిసిన అనంతరం అవార్డు ప్రకటించి జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ను బహూకరించారు.
ఉదయం 8 నుంచి 10 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.గోవర్ధన్రెడ్డి, జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ హాజరయ్యారు. తైక్వాండో కోచ్ మనోజ్ పర్యవేక్షణలో విద్యార్థినులు, యువతులు ఎంతో అలవోకగా స్వీయరక్షణ టెక్నిక్లను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలు స్వీయరక్షణ పద్ధతులను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. జాతీయ స్థాయిలోనే కాకుండా ఆసియా స్థాయిలో రికార్డు నెలకొల్పేలా బాలికలు, మహిళలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయం. అందరి కృషి, అంకితభావంతోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైంది.
– ఎస్.గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ను శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులు, యువతులకు అంకితం చేస్తున్నాం. బాలికలు, మహిళల పట్టుదల, కృషితోనే ఇది సాధ్యమైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు స్వీయ రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించగా.. విశేష స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పటివరకు 14 వేల మందికి శిక్షణ ఇప్పించాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తోడ్పాటునందించిన జిల్లా యంత్రాంగం, పోలీసు తదితర శాఖల అధికారులను అభినందిస్తున్నాం.
– సునీతా కుంచాల, జిల్లా జడ్జి
స్వీయరక్షణ పద్ధతులను నేర్చుకున్న వారు ఒక్కొక్కరు కనీసం మరో పది మందికి వాటిని నేర్పాలి. తద్వారా లక్ష మందికి పైగా స్వీయ రక్షణ శిక్షణ పొందినట్లు అవుతుంది. శిక్షణను నిలిపివేయకుండా మున్ముందు కూడా కొనసాగించాలి.
-కల్మేశ్వర్ , సీపీ