వేల్పూర్, నవంబర్ 28 : గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బాల్కొండ నియోజకవర్గంలో రూ. 6వేల కోట్లతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేల్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కండ్ల ముందున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ ప్రజా సేవలో ఐదేండ్లు అంకితమవుతానన్నారు.అందరి దీవెనలు, కేసీఆర్ దయతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. అన్ని కులసంఘాలకు భవనాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. జనవరిలో ఇంకా మిగిలిన కొంతమందికి పింఛన్లు, రేషన్ కార్డులు, గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లను మంజూరుచేస్తామన్నారు.కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే రెండు వేల రూపాయల పింఛన్ ఐదు వేలకు పెంచుతామని, పది వేల రూపాయల రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామన్నారు. రైతుబీమా తరహాలో భూమి లేని పేదలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా అందిస్తామని, అర్హత గల ప్రతి మహిళకూ సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతినెలా రూ. 3 వేలు అందిస్తామని వివరించారు.
రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ ఖర్చును రూ.15 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే ఇప్పిస్తామన్నారు.తాను మళ్లీ గెలవగానే రాబోయే ఐదేండ్లలో భీమ్గల్లోని నింబాచల క్షేత్రాన్ని రూ.20 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చౌట్పల్లి హన్మంత్రెడ్డి లిఫ్ట్కు ఉన్న సిమెంట్ పైపులైన్ను స్టీల్ పైపులైన్గా మారుస్తానని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పోచంపాడ్ ప్రాజెక్టులో పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. బాల్కొండ గ్రామప్రజలు కోరుకుంటే మున్సిపాలిటీగా మారుస్తానని మాటిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయని, సంక్షేమ పథకాలన్నీ కూడా మీ కుటుంబాలకు అందిన విషయం తెలిసిందేనన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి ఎన్నో పథకాలు అన్ని పార్టీల వారికి కూడా అందాయని తెలిపారు. తొమ్మిదేండ్లుగా ప్రజల కోసం ఇష్టపడి చెమటోడ్చిన తనను కారు గుర్తుకు ఓటేసి దీవించాలని కోరారు.