నందిపేట్/తాడ్వాయి, జూన్ 21 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా నందిపేట్ మండలంలోని కౌల్పూర్ వీడీసీ సభ్యులు, వెల్మల్ గ్రామానికి 30 కులసంఘాల ప్రతినిధులు, నందిపేట్ మండల మెడికల్ అసోసియేషన్ సభ్యులు బుధవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరుతున్నాయన్నారు. దీంతో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మౌలిక సదుపాయాలు లేక ఎంతో ఇబ్బందులు పడేవారని ఇప్పుడు ప్రతి గ్రామంలో మౌలిక వసతులు, సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, రెట్టింపు మెజార్టీతో గులాబీ జెండా ఆర్మూర్ గడ్డపై మరోమారు ఎగరబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సమక్షంలో బీజేపీ నాయకుల చేరిక
తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు చిల్కూరి రాజిరెడ్డి, బద్దం బాల్రెడ్డి, గంగారెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీలో చేరగా ఎమ్మెల్యే జాజాల సురేందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్రెడ్డి, సర్పంచ్ నర్సారెడ్డి, ఎంపీటీసీ జలందర్రెడ్డి, పార్టీ గ్రామాధ్యక్షుడు మహిపాల్, బీఎంసీ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.