రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆకాశాన్ని తాకేలా, సమసమాజానికి స్ఫూర్తి నింపేలా బాబాసాహెబ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని నిర్మించినందుకు తెలంగాణ సమాజం జేజేలు పలుకుతున్నది. రాష్ట్రంలో బడుగువర్గాలకు అండగా నిలుస్తూ, బహుజన సాధికారత, ఆర్థిక స్వావలంబనకు అనేక పథకాలు అమలుచేస్తున్న కేసీఆర్.. అంబేద్కర్కు నిజమైన వారసుడంటూ దళిత సంఘాలు కీర్తిస్తున్నాయి. బాబాసాహెబ్ బాటలో నడుస్తున్న సీఎంకు రుణపడి ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నాయి.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 15
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని చూసి బహుజనం గర్విస్తున్నది. శిఖరమంత విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని హర్షం వ్యక్తంచేస్తున్నారు. భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితజాతి గౌరవాన్ని కేసీఆర్ పెంచారని అభిప్రాయపడుతున్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్సాగర్ ఒడ్డున అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంపై సంబురాలు జరుపుకొంటున్నారు. దళితబంధు, డాక్టర్ అంబేద్కర్ విద్యానిధి పథకం, దళితవాడలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్స్, హాస్టళ్లు, ఆర్థిక ప్రోత్సాహం ఇలా దళిత సమాజం మేలు కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అంబేద్కర్ నిజమైన వారసుడిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని దళిత సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
కేసీఆర్ వెంటే.. దళిత సమాజం
బాన్సువాడ, ఏప్రిల్ 15: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం హర్షణీయం. ఏ నాయకుడికి రాని ఆలోచన సీఎం కేసీఆర్కే సొంతం. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు దాటినా అంబేద్కర్ను ఏ పాలకులూ గుర్తుంచుకోలేదు. దళిత సమాజం ఓట్ల కోసమే తప్ప వారి బాగోగులను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వమే దళిత సమాజానికి అత్యున్నత గౌరవం ఇస్తున్నది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పాలిస్తున్నది. అంబేద్కర్ విశిష్టత తెలిసేలా ఫొటో గ్యాలరీ, గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయం. మాటలు చెప్పే పాలకులను చూశాం.. ఇచ్చిన మాటను ఆచరణలో పెట్టిన మహానాయకుడు కేసీఆర్. సామాజిక సేవలు అందించే యువతను గౌరవించేందుకు అంబేద్కర్ పేరిట అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించడం సంతోషకరం. దళిత సమాజం ఎల్లవేళలా సీఎం కేసీఆర్ వెంటే నడుస్తుంది.
అంబేద్కర్పై గౌరవానికి నిదర్శనం..
కమ్మర్పల్లి, ఏప్రిల్ 15: అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకున్నది. విశ్వ మేధావికి అంబరమంత గౌరవాన్ని ఇవ్వడం దళిత వర్గాలకు సంతోషం కలిగిస్తున్నది. అంబేద్కర్ పోరాటాలు, ఆయన నింపిన స్ఫూర్తిని ఈ భారీ విగ్రహం.. భావితరాలకు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది.
– సుంకరి విజయ్, ఏవైఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు
ప్రత్యేక ధన్యవాదాలు
కామారెడ్డి, ఏప్రిల్ 15 : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయ డం అభినందనీయం. తెలంగాణలోనే కాకుండా యావత్ భారత్ దేశంలో ఏ ముఖ్యమంత్రీ నిర్మించలేని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి.. దళితులకు సముచిత స్థానాన్ని ఇచ్చారు. దళితబంధు ఇచ్చి ఎంతో మంది దళితులను ఆదుకున్న మహనీయుడు… ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిచారు.
-బదావత్ ప్రవీణ్ నాయక్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
తెలంగాణ సర్కారుకు దళిత బహుజనుల జేజేలు..
డిచ్పల్లి, ఏప్రిల్ 15: తెలంగాణ సమాజానికి, అంబేద్కర్కు విడదీయరాని సంబంధం ఉంది. తాను రాసిన రాజ్యాంగంలోని చిన్న రాష్ర్టాల ఏర్పాటు ఆర్టికల్ 3 మార్గదర్శనం ద్వారానే తెలంగాణ సిద్ధించింది. దీనిని గుర్తించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సామాజిక చైతన్యానికి తెరలేపిన తెలంగాణ ప్రభుత్వానికి దళిత బహుజనులు జేజేలు పలుకుతున్నారు. అంబేద్కర్ అంటే విగ్రహం ఒకటే కాదు… రాజ్యాంగమంటే పుస్తకమే కాదు.. యావత్ దేశప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపర్చాలనే దృక్పథం. అంబేద్కర్ మనకు దిక్సూచి. ఆయన ఆశయాలే పాలనకు స్ఫూర్తి అని పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరొక వైపు త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్తూపం. వీటి నడుమ (125 అడుగుల) శిఖరమంత ఎత్తున నిలిచిన మహానుభావుడు. నిజానికి అంబేద్కర్ విగ్రహ స్థాపన అంటే జ్ఞాన సామ్రాజ్యాన్ని స్థాపించడమే.
– డాక్టర్ ఏ.పున్నయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ యూనివర్సిటీ
గర్వించదగ్గ విషయం…
కామారెడ్డి, ఏప్రిల్ 15 : దాదాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ప్రతి మండలం నుంచి అన్ని సౌకర్యాలు కల్పించి విగ్రహావిష్కరణకు దళితులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయం. దళితులకు సముచిత స్థానం కల్పించడం ఎంతో సంతోషకరం. త్వరలో దళితులకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాం. ఏ ప్రభుత్వమూ దళితులకు సౌకర్యాలు, సముచిత స్థానం కల్పించలేదు. దళిత సమాజ సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-పొట్టిగిని శంకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కామారెడ్డి
దళితజాతి గర్వపడుతుంది..
నిజాంసాగర్, ఏప్రిల్15: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో దళితజాతి గర్వపడుతుంది. సామాజిక అసమానతలను రూపుమాపడానికి జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు పాలించాయి.. కానీ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్కు ఇంతలా గౌరవించలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే అంబేద్కర్ ఖ్యాతిని గుర్తు చేస్తూ మహా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళితులు అందరితో సమానంగా, గౌరవంగా తలెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళితజాతి అభ్యున్నతికి కృషి చేస్తున్నది సీఎం కేసీఆరే..
– బేగరి రాజు, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు, నిజాంసాగర్
మరిచిపోలేని రోజు
నిజాంసాగర్, ఏప్రిల్15: హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం చరిత్రలో మరిచిపోలేని రోజు. ప్రస్తుతం దళితులు సంఘంలో పోటీపడుతూ ముందుకు సాగడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఇంతటి చరిత్ర గల మహోన్నత వ్యక్తిని సీఎం కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచేలా విగ్రహాన్ని నెలకొల్పడం దళిత జాతికే కాదు.. దేశం మొత్తం ఆయనకు సలాం చేయాల్సిందే. రాష్ట్రం సాధించుకున్న తర్వాత దళితుల గురించి సీఎం కేసీఆర్ ప్రతి నిత్యం తాపత్రయపడుతూ దళితబంధు పథకంతోపాటు దళితులు సంతోషంగా ఉండాలని మాకు సముచిత స్థానం కల్పిస్తున్నాడు. అంబేద్కర్ పేరిట అవార్డులను అందజేస్తామని ప్రకటించడం గొప్ప విషయం.
– గైని విఠల్, దళితబంధు మండల కన్వీనర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు, నిజాంసాగర్
రుణపడి ఉంటాం..
నస్రుల్లాబాద్, ఏప్రిల్ 15: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే విశ్వ మేధావి అయిన అంబేద్కర్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనంత పెద్ద విగ్రహం నిర్మించడం చాలా ఆనందదాయకంగా ఉంది. సీఎం కేసీఆర్ దళితులపై ప్రత్యేక శ్రద్ధతో దళితబంధు ఇతర సంక్షేమ పథకాలతోపాటు విగ్రహం ఏర్పాటు చేసి దళిత ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు.
– బంగారు మైసయ్య, ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, దుర్కి
ప్రజలందరికీ స్ఫూర్తి..
డిచ్పల్లి, ఏప్రిల్ 15: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో ప్రతిష్టించడం సీఎం కేసీఆర్ మాటతప్పని వ్యక్తిగా రుజువు చేసుకున్నారు. నేను స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది విగ్రహం కాదు.. విప్లవ బాట. వేలాది అణగారిన వర్గాలకు ఒక పోరాట బలం. చదువుకునే పిల్లలకు ఒక మార్గదర్శకం. రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్య పరిరక్షణకు దిశా నిర్దేశం. విగ్రహం నిలపడం ఒక ఎత్తయితే.. అంబేద్కర్ ఆశయ సాధన చాలా ముఖ్యం. సీఎం కేసీఆర్ దళితులకు ప్రకటించిన సంక్షేమ పథకాలు అందిస్తారనే నమ్మకం కలిగించారు. విగ్రహం ఒక చారిత్రక సత్యం అయితే.. దళిత బహుజనులు అంత ఎత్తుకు ఎదిగే విధంగా బాటలు వేయడం ప్రభుత్వ బాధ్యతగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ నిలువెత్తు మూర్తి దళితులకు మాత్రమే కాదు ప్రజలందరికీ స్ఫూర్తి కావాలి.
– కైత సోలమన్, విశ్రాంత ఉపాధ్యాయుడు, డిచ్పల్లి
అంబేద్కర్కు నిజమైన వారసుడు కేసీఆర్…
బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 15: అంబేద్కర్ కలలు కన్న దళితుల అభ్యున్నతి తెలంగాణ ప్రభుత్వంతో సాధ్యమవుతోంది. 45ఏండ్ల పాటు వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వర్తించాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుల ఆర్థికాభివృద్ధిలో వచ్చిన మార్పు మరెక్కడా చూడలేదు. దేశంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించడమే. చాలా మంది నాయకులు అవసరం రీత్యా, పరిస్థితులకు అనుకూలంగా అంబేద్కర్ పేరును ఉపయోగించడం చేస్తారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్కు నిజమైన వారసుడిగా నిలిచారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ దళితుల అభ్యున్నతికి అనునిత్యం తాపత్రయపడే నాయకుడు సీఎం కేసీఆర్.
– జగన్ మోహన్, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, బాన్సువాడ
దళితపక్షపాతి.. సీఎం కేసీఆర్
బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 15: బి.ఆర్. అంబేద్కర్ 125అడుగుల విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం హర్షణీయం. హైదరాబాద్ చరిత్రలో ఈ విగ్రహం మరో మైలురాయిగా నిలుస్తుంది. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ నిలబడుతోంది. సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని నిరూపితమైంది. కేసీఆర్ ప్రతి ఆలోచనలో అంబేద్కర్ను దిక్సూచిగా తీసుకోవడమే కాకుండా, అంబేద్కర్ ప్రతిపాదించిన ఆర్థిక సూత్రాలు, పాలనా దక్షతను తూచ తప్పకుండా పాటిస్తూ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ దళితుల అభ్యున్నతికి తోడ్పడుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్.
– దొన్కంటి పెద్ద సాయిలు, దళిత సంఘం నాయకులు, బాన్సువాడ
ప్రతిమ కాదు.. ఆత్మాభిమానానికి ప్రతీక
బీర్కూర్, ఏప్రిల్ 15: హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన 125 అడుగుల మహావిగ్రహం కేవలం విగ్రహం మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీక. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను చూశాం. మహాత్ముల జయంతులు, వర్ధంతులు జరిపి చేతులు దులుపుకొన్నాయే తప్ప.. ఇలా మాట ఇచ్చి దానిని నిటబెట్టుకున్న మహోన్నత వ్యక్తి కేసీఆర్ మాత్రమే. ఒక్కసారి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నది.
– వడ్ల భూమయ్య, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి, బీర్కూర్
చరిత్రను తిరగరాసిన కేసీఆర్..
బీర్కూర్, ఏప్రిల్ 15: నేను పుట్టుకతో అంధుడిని. ఆ మహానుభావుడు అంబేద్కర్ రూపం చూడకపోయినా ఆయన రాసిన రాజ్యాంగంతో నేను చదువుకొని కొలువు సాధించాను. ఇప్పుడు దేశమంతా అంబేద్కర్ గురించి.. అందులో తెలంగాణలో ఏర్పాటు చేసిన 125 అడుగుల విగ్రహం గురించి చెబుతుంటే చరిత్రను తిరగరాసిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని స్పష్టమవుతుంది. కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర పుటల్లో మరో సువర్ణ అధ్యాయానికి తెరలేసిందని చెప్పవచ్చు.
– గైని సంతోష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బరంగేడ్గి
ప్రభుత్వ ఆలోచన అభినందనీయం
కమ్మర్పల్లి, ఏప్రిల్ 15: హైదరాబాద్లో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ ఆదర్శవంతమైన ఆలోచనగా చెప్పాల్సిందే. ప్రపంచంలోనే ఎత్తయిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో నిలిపి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్పై తనకున్న గౌరవాన్ని చాటింది. అంబేద్కర్కు కేసీఆర్ ఇచ్చిన అపార గౌరవం దేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి తీరుతుంది. సచివాలయానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టుకోవడం అంబేద్కర్ భావ జాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవ ప్రతీక. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటే.. విగ్రహం దిగువన అంబేద్కర్ జీవిత విశేషాల సమాచార వేదిక అందుబాటులోకి తేవడం సంతోషకరం.
-జి.సాయన్న, లెక్చరర్, కమ్మర్పల్లి