నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఇందల్వాయి, డిసెంబర్ 16:వన్యప్రాణులకు రక్షణ కరువైంది. చిరుతల వరుస దుర్మరణం కలకలం రేపుతున్నది. ఉమ్మడి జిల్లాలో మూగజీవాల మృత్యుఘోష ఆందోళన కలిగిస్తున్నది. రోడ్లను దాటే క్రమంలో అడవి జంతువులు వాహనాల కింద నలిగిపోతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని జాతీయ రహదారిపైనే వన్యప్రాణులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో చిరుతలు మృత్యువాత పడుతున్నా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఏమాత్రం స్పందించడం లేదు. వన్యప్రాణుల సంరక్షణకు రోడ్డుకు ఇరువైపులా కంచె (ఫెన్సింగ్) వేయాల్సి ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా దగ్గి శివారులో మరో చిరుత రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత చెందింది. గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు చర్యలు చేపట్టి ఉంటే తాజా ప్రమాదం జరిగేది కాదని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇప్పటికైనా ఎన్హెచ్ఏఐ స్పందించి కంచె నిర్మించాలని కోరుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. చిరుతపులులు వరుసగా దుర్మరణం చెందుతున్నాయి. ఎన్హెచ్ఏఐ, అటవీ శాఖ వైఫల్యం మూలంగా వన్య ప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి. పచ్చని అడవుల్లో సంచరించాల్సిన అడవి జంతువులు దారి తప్పి రోడ్లపైకి వస్తుండటంతో భారీ వాహనాల కింద నలిగి పోతున్న ఘటనలు పెరిగి పోతున్నాయి. తాజాగా గురువారం రాత్రి నిజామాబాద్ – కామారెడ్డి జిల్లా సరిహద్దులోని మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్లో 44వ జాతీయ రహదారిపై చిరుతపులి మృతి చెందడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది. వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం మూలంగా మూగ జీవాల ఆయుష్షు అర్ధాంతరంగా ముగిసిపోతున్నది. నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల్లో కనీస చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురిస్తున్నది. గతంలో కంటే చిరుత పులుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో భారీగా పెరిగింది. పెరిగిన అడవి జంతువులకు రక్షణ కవచం లాంటి చర్యలు తీసుకోవడంలో అటవీ శాఖ మరింత శ్రద్ధ చూపితే బాగుంటుందని జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు.
డెడ్ స్పాట్గా దగ్గి..
మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్, సిర్నాపల్లి అటవీ ప్రాంతాల కలయికకు దగ్గి, చంద్రాయన్పల్లి ప్రాంతాలు సరిహద్దు. ఈ స్థలమే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను సైతం వేరు చేస్తున్నది. ఉభయ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో దగ్గి గ్రామం కామారెడ్డి జిల్లాలో, చంద్రాయన్పల్లి తండా నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ రెండు గ్రామాల మధ్యలో విస్తరించిన దట్టమైన అటవీ ప్రాం తంలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నా యి. అడవులను అడ్డంగా నరికి వేయడం మొదలు వన్య ప్రాణులను వేటాడడం తరచూ జరుగుతున్నది. అటవీ శాఖ వైఫల్యం మూలంగా అడపాదడపా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇదే ప్రాంతం మీదుగా 44వ జాతీయ రహదారి సైతం విస్తరించి ఉంది. రాత్రివేళల్లో అటవీ జంతువులు ఈ రోడ్డు దాటుతూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. భారీ వాహనాలను నియంత్రించలేక డ్రైవర్లు అడ్డొచ్చిన మూగ జీవాలను ఢీకొడుతున్నారు. రాత్రివేళల్లో అకస్మాత్తుగా జంతువులకు అడ్డు రాకుండా ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్న క్రూర మృగాలు, ఇతర జంతువుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. నెలన్నర కిందట దగ్గి ప్రాంతంలోనే ఓ జింక మృతి చెందింది. డిసెంబర్ 14న చిరుత పులి రోడ్డు ప్రమాదంలో బలి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దగ్గి-చంద్రాయన్పల్లి శివారులోని కేవలం నాలుగు కిలోమీటర్ల పరిధిలో గతంలో మూడు చిరుతలు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రాంతం అటవీ జంతువులకు డెడ్ స్పాట్గా మారినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
పెరిగిన చిరుతలు..
2018లో రాష్ట్రంలో జంతు గణన జరిగింది. ఆ తర్వాత గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని ఎంపిక చేసిన అటవీ ప్రాంతాల్లోనే చేపట్టింది. టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లోనే జంతు గణను చేపట్టినప్పటికీ మిగిలిన చోట్ల ఆసక్తి కలిగిన అటవీ శాఖ సిబ్బంది జంతు గణనను నిర్వహించారు. శాస్త్రీయబద్ధంగా జంతు గణనను చేపట్టనప్పటికీ ఉమ్మడి జిల్లాలో చిరుతల సంచారం భారీగా పెరిగిందని తెలుస్తోంది. అడవుల్లో కలియ తిరిగిన సంబంధిత సిబ్బంది కనిపించిన ఆనవాళ్ల ప్రకారం, ఆయా గ్రామాల్లో చిరుత పులులు కనిపించిన సందర్భాల అనుసారం వీటి సంఖ్య 50 వరకు చేరినట్లుగా గుర్తించారు. గతంలో కేవలం పదుల సంఖ్యలోనే ఉన్న క్రూర మృగాల సంఖ్య ఇప్పుడేకంగా అర్ధ శతకానికి చేరడంతో అప్రమత్తం కావాల్సిన అటవీ శాఖ మాత్రం చేతులు ఎత్తేసినట్లుగా ఉండడం ఇప్పుడు శోచనీయంగా మారింది. వేటగాళ్ల నియంత్రణలో సక్సెస్ అయిన అటవీ శాఖ అధికారులు.. రోడ్డు ప్రమాదాల్లో మూగ జీవాల ప్రాణాలు పోకుండా చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందడం చర్చనీయాంశమవుతున్నది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 52,133 హెక్టార్ల విస్తీర్ణం, ఆర్మూర్లో 33,778 హెక్టార్లు, కామారెడ్డి 40,500హెక్టార్లు, బాన్సువాడ డివిజన్లో 40,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆయా అడవుల్లో ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబార్, కొండ గొర్రెలు, దుప్పిలు, నీల్గాయి, తోడేళ్లు, మనుబోతులు, అడవి కుక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు, అడవి పందులు వందల సంఖ్యలో ఉన్నాయి.
వసూళ్లపైనే దృష్టి..
క్రూర మృగాలు, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం టోల్ వసూళ్లపైనే దృష్టి సారించిన ఈ సంస్థ.. జంతు సంరక్షణ చర్యలను గాలికొదిలేసింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం జాతీయ రహదారికి ఇరువైపులా రక్షణ కంచెలు నిర్మించాలి. అడవి జంతువులు రోడ్లపైకి రాకుండా ఫెన్సింగ్ నిర్మించాల్సి ఉంటుంది. 44వ జాతీయ రహదారి విస్తరించిన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రక్షణ కంచెలు నిర్మించిన ఎన్హెచ్ఏఐ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం విస్మరించింది. ఫలితంగా తరచూ వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయి. టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఫెన్సింగ్ నిర్మించడంలోనూ చూపాలని జంతు ప్రేమికులు ఎన్హెచ్ఏఐ అధికారులను కోరుతున్నారు.
నేషనల్ హైవే అథారిటీకి లేఖలు రాశాం…
చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో నీటి జాడలు పెరగడం మూలంగా జంతువుల కదలికలు విస్తృతమయ్యాయి. తద్వారా అడవి జంతువులు ఆ ప్రాంతంలో ఎక్కువగా తచ్చాడుతున్నాయి. మూగ జీవాల రక్షణ కోసం అండర్ పాస్లు నిర్మించాలని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశాం. వారి నుంచి స్పందన రాలేదు. ఇకపై జంతువుల ప్రాణాలను కాపాడేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటాము.
– కె.రామ్కిషన్, ఇన్చార్జి డీఎఫ్వో, నిజామాబాద్
చిరుతల దుర్మరణం
2018 ఫిబ్రవరి 12
నవీపేట్ మండలం జగ్గరావుఫారం ప్రాంతంలో రాత్రివేళ జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృత్యువాత పడింది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
2018 మార్చి 26
లింగంపేట మండలం ఎక్కపల్లి తండా శివారులో ఓ చిరుత మృత్యువాత పడింది.
2018 మే 11
దేవితండా వద్ద చిరుత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది.
2022 సెప్టెంబర్ 15
సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలో రెండేండ్ల వయస్సున్న చిరుత మృతి చెందింది.
2023 ఫిబ్రవరి 9
ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో రోడ్డు దాటుతూ ఓ చిరుత మృత్యువాత పడింది.
2023డిసెంబర్ 14
చంద్రాయన్పల్లి-దగ్గి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మరో చిరుత చనిపోయింది. ఇలా తరచూ అడవి జంతువులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడినా అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టక పోవడం విషాదకరం.