కోటగిరి, ఆగస్టు 16: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. గేట్లు, గోడలు లేని చోట పశువులు యథేచ్ఛగా లోపలికి వస్తూ మొక్కలను తినేస్తున్నాయి. దొంగల భయమూ వెంటాడుతోంది. మండలంలో ప్రహరీలు లేని పాఠశాలల ఎన్నో ఉన్నాయి. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రహరీలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మండల కేంద్రంలోని మాలివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణ మొత్తం ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఉండడంతో విష సర్పాలు ప్రవేశిస్తున్నాయి. ఇటీవల రెండు దఫాలుగా స్కూల్ ఆవరణలోకి పాములు వచ్చాయని, దీంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని వారి తల్లిదండ్రులు వాపోయారు. స్కూల్కు ప్రహరీ నిర్మించాలని కోరుతున్నారు.
మండలంలోని ఎత్తొండ క్యాంప్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క గేటు ఉన్నా, మరో పక్క గుట్ట ప్రాంతం వైపు ప్రహరీ లేకపోవడంతో పాములు, తేళ్లు పాఠశాలలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల పాఠశాలలోకి ఓ పాము వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర భయందోళన చెందారు. ప్రహరీ లేకపోవడంతో సెలవు రోజుల్లో బయటి వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించి పూల మొక్కలు, వాటర్ ట్యాంకు, కుళాయిలను ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందిం చి ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.