నిజామాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజాంసాగర్ : ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్కడి ప్రజలు అనేక ప్రయోజనాలను దక్కించుకుంటుండగా తాజాగా నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నాన్ కమాండ్ ఏరియాకు సాగు నీటి కల్పనకు ఉద్దేశించిన నాగమడుగు ఎత్తిపోతల పథకం, మంజీర నదిపై నిర్మించిన నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవంతో మరింత శోభను సంతరించుకున్నది.
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చిన మంత్రి కేటీఆర్ ఏకంగా మూడున్నర గంటల పాటు జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన సాగించారు. పిట్లం సభను చూసి మురిసిపోయారు. భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ కేసీఆర్ పరిపాలనలో కులవృత్తులకు, సామాన్య ప్రజలకు చేకూరిన మేలును విపులంగా విశదీకరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చీల్చిచెండాడారు. మంత్రి కేటీఆర్ ప్రసంగించే సమయంలో జనం నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది. చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
నిజాంసాగర్కు జీవం..
నీళ్ల పోరాటం ఫలించి ఎండిపోయిన నిజాంసాగర్ జీవం పోసుకున్నది. జుక్కల్, బాన్సువాడకు ఢోకా లేకుండా రెండు పంటలకు శాశ్వతంగా నీళ్లు అందుతున్నాయని కేటీఆర్ అన్నారు. మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్కు నీళ్లు ఇస్తున్న ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. నదికి నదిని మలిపిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. జుక్కల్లో కరెంట్కు ఎంత గోస ఉండేదో గుర్తుకు తెచ్చుకోవాలని, ఎవరైనా చనిపోతే కరెంటోళ్లకు ఫోన్ చేసి బతిమిలాడుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదో గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని కేటీఆర్ కోరారు. జుక్కల్ నియోజకవర్గానికి రైతుబంధు కింద 86వేల మందికి రూ.480కోట్లు మంజూరవుతున్నాయని చెప్పారు. ఇక్కడ ఒక్కో ఊరికి వందల పింఛన్లు వచ్చాయని, జుక్కల్లోనే 35,750 మందికి వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల్లో ఇవి ఉన్నా యా? అని తెలిసినోళ్లు, చుట్టాలకు అడిగి వివరాలు తెలుసుకోవాలన్నారు. పేదోళ్లను కడుపులో పెట్టుకుని చూసుకునే సంస్కా రం అక్కడి ప్రభుత్వాలకు ఉన్నదా అని ప్రశ్నించారు.
షిండేను 72వేల మెజార్టీతో గెలిపించండి..
మూడు పర్యాయాలుగా ప్రజల మధ్య ఉంటూ వారిలో మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే హన్మంత్ షిండే అని కేటీఆర్ కితాబునిచ్చారు. తనను కలిసినప్పుడల్లా జుక్కల్ ప్రాంతానికి ఏదో ఒకటి మంజూరు చేయాలని అడగడం తప్ప వ్యక్తిగతంగా పనులు తీసుకువచ్చే మనస్తత్వం షిండేకు లేదన్నారు. గత ఎన్నికల్లో 36వేల మెజారిటీతో హన్మంత్ షిండే గెలిచారని, వచ్చే ఎన్నికల్లో 72వేల మెజారిటీ వచ్చేలా ఈ ప్రాంత ప్రజలంతా కలిసి షిండేకు ఓట్లేసి.. కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని కోరారు. ఇరిగేషన్ ఉద్యోగిగా పని చేసిన అనుభవంతో సాగునీటి సమస్య పరిష్కారం కోసం షిండే చేసిన ప్రయత్నం గొప్పదన్నారు. జుక్కల్ అభివృద్ధికి కోరిన పనులన్నీ చేసి పెడతానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అలాగే పిట్లం, బిచ్కుందను మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. లెండి కాలువ ద్వారా సాగు నీరు అందించే నూతన ప్రతిపాదనను సైతం పరిశీలిస్తామన్నారు.
తెలంగాణకు పట్టిన దరిద్రం బీజేపీ..
భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రం, శని అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ‘మోదీకీ, ఈడీకీ భయపడేది లేదు. భయపడేది దొంగలు, తప్పు చేసినోళ్లు’ అని స్పష్టం చేశారు. ‘ప్రజా కోర్టులో తేల్చుకుందాం. ప్రజలే తేలుస్తారు’ అంటూ సవాల్ చేశారు. 2023లోనే తీర్పు చెబుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సిలిండర్ రూ.400 అయితే ఆయన్ను దద్దమ్మ అని గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అభివర్ణించారని, ప్రస్తుతం సిలిండర్ను రూ.1200కు తీసుకు వచ్చిన నరేంద్ర మోదీని ఏమనాలి? దద్దమ్మ అనా? సన్నాసి అనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మహా నటుడు మోదీ అని ఆయనను ఆస్కార్కు పంపితే తప్పక అవార్డు వచ్చేదన్నారు. దేశ సంపద దోచి వాళ్ల దోస్త్ ఖాతాలో వేసి వాడి వద్ద నుంచి చందాలు తీసుకుని ప్రతిపక్షాలను చీల్చుతున్నాడంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీలో ఫేకుడైతే గల్లీలో జోకుడుగాడు తయారైండని బండి సంజయ్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యస్ర్తాలు సంధించారు. ఇక్కడి బీజేపీ అధ్యక్షుడైతే మోదీ దేవుడంటూ చెప్పాడని గుర్తుచేశారు. ఎవడికి దేవుడు? నీకు, నీ అదానీకి దేవుడు అంటూ కేటీఆర్ తిప్పికొట్టారు.
బీఆర్ఎస్తో బీజేపీలో గుబులు.. : సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని అది త్వరలోనే తప్పక నెరవేరుతుందన్నారు. భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ఏర్పడిన అనంతరం మహారాష్ట్రలో జరిగిన సమావేశంతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. మనం ఒకనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చూశాం. ఆయన రూ.2కే కిలో బియ్యం, జనతా వస్ర్తాలు, పక్కా ఇండ్లు వంటి మూడే పథకాలతో జనాల్లోకి వచ్చాడు. సీఎం కేసీఆర్ అలాంటివి 36 పథకాలతో ప్రజల్లో నిలిచారు. మూడు పథకాలకే ప్రభంజనం సృష్టిస్తే 36 పథకాలున్న కేసీఆర్కు తిరుగేలేదని స్పీకర్ జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. మనమంతా అదృష్టవంతులమంటూ వివరించారు. దేశ, విదేశాల్లో కేటీఆర్ పేరు చెబితే తెలియని వారు లేరని కితాబునిచ్చారు.
ఐటీల్లో 9లక్షలు, పరిశ్రమల్లో 18లక్షల మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేయడం మాటలతో కూడుకున్నది కాదన్నారు. ఈ ప్రయత్నం కేటీఆర్తోనే సాధ్యమైందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ఐటీ మంత్రులతో కాలేదని తెలిపారు. తండ్రీకొడుకులు ఇద్దరు ఎవరి శక్తి ఎంత ఉందో పోటీ పడి పని చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ కృషి అభినందనీయమన్నారు. ఇద్దరి నాయకత్వంలో రాష్ట్రం, దేశం ముందుకు పోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ర్టాల్లో కలిపి 29 మంది సీఎంలకు సాధ్యంకాని పనులను కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. కేసీఆర్ చొరవతోనే నిజాంసాగర్ ప్రాజెక్టు, దాని దిగువ నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకాలు భవిష్యత్తులో నిండుకుండలా మారుతాయన్నారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు రూ.1500కోట్లతో కాలువలను కేసీఆర్ తవ్వించారని వివరించారు. వచ్చే జూన్, జూలైలో నిజాంసాగర్కు నీళ్లు వదులుతారని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా జనమంతా కవితమ్మకు అండగా.. : మంత్రి వేముల
మోదీ రాజకీయ అంతం చూసే దాకా విశ్రమించేది లేదంటూ వేముల ప్రకటించారు. 2014లో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.57వేల కోట్లు అయితే ఇప్పుడు రూ.1.83లక్షల కోట్లకు పెరిగి 3లక్షల నుంచి ఎనిమిదిన్నర లక్షల మందికి ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహించి దేశ, విదేశాలు తిరిగి 25వేల కొత్త పరిశ్రమలను కేటీఆర్ తెచ్చారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులపై ఏపీకి చెందిన ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారన్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి విమానంలో వస్తుంటే తన పక్కనే ఏపీకి చెందిన ఓ ఉన్నతాధికారి కూర్చున్నాడని, తనను గుర్తుపట్టి మాటామంతి కలిపి మీరు అదృష్టవంతులు సార్… అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తన అనుభవాన్ని మంత్రి వేముల సభలో వివరించారు. అందుకు బదులుగా ఎందుకని ప్రశ్నించగా.. కేటీఆర్ లాంటి మంత్రి మీకు ఉండడంతో పెట్టుబడులు వస్తున్నాయని, ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెబుతుంటే మనస్సు ఉప్పొంగిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తి మా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడం సంతోషంగా ఉందన్నారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.