కోటగిరి, నవంబర్ 24: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగిరం చేసి జూన్ నాటికి పూర్తి చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వర్ని మండలం సిద్ధాపూర్లో రూ.120కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట కాలువ పనులు కూడా చేపట్టాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కోట్లాది రూపాయలను వెచ్చించి రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనే దురాశతో ప్రభుత్వాలను పడగొట్టడం కాదని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను నిర్మించాలని బీజేపీ నేతలకు హితవుపలికారు.
రాష్ర్టాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనే కాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ప్రాజెక్టులను అర్థం చేసుకోకుండా బీజేపీ విమర్శలకు దిగుతున్నదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న చిత్తం.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడంపై ఉంచితే ప్రజలు ఆదరిస్తారన్నారు. సీఎం కేసీఆర్కు జిల్లాపై ఉన్న మమకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయని, రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు అర్థం చేసుకొని ఆదరించాలని కోరారు.
స్పీకర్ వెంట జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీవీర్రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, ఆర్డీవో రాజేశ్వర్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ వాసంతి, ఈఈ రమాదేవి, డిప్యూటీ ఈఈ శ్రావణ్ కుమార్, ఏఈ శ్రీనివాస్, సర్పంచులు శ్రీనగర్ రాజు, నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి తదితరులు పాల్గొన్నారు.
మరో 106 కోట్లతో జాకోరా,చందూర్ ఎత్తిపోతల పథకాలు
బాన్సువాడ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో లక్ష ఎకరాలు ఉన్నాయని, మిగిలిన నాన్-కమాండ్ ఏరియాకు సా గునీరు అందించేందుకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్ధాపూర్ రిజర్వాయర్తోపాటు జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను రూ.106 కోట్లతో చేపట్టనున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా 30వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతం జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతమన్నారు. ఈ రిజర్వాయర్తో ఈ ప్రాంతంలోని లంబాడాలు ఎక్కువ ప్రయోజనం పొందుతారన్నారు. భూగర్భజలాలను సమృద్ధిగా పెంచాలన్న ఉద్దేశంతో బాన్సువాడ నియోజకవర్గంలోని మంజీరా నదిపై నాలుగు చెక్డ్యామ్లను నిర్మిస్తున్నామన్నారు. వ్యవసాయం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను రైతులకు అందిస్తే, వారు అద్భుతమైన పంటలు పండిస్తారన్నారు.