సంవత్సరాల తరబడి వెట్టిచాకిరి.. సమైక్య పాలనలో అదే శ్రమ దోపిడీ.. ఎంత పని చేసినా సరైన జీతం లేదు సరికదా కనీస గుర్తింపు లేదు. దశాబ్దాలుగా నలిగి పోయిన కామ్దార్లకు తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్ పాలనలోనే వారికి ఆత్మగౌరవం దక్కింది. ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగానికి భరోసా లభిస్తున్నది. గ్రామ రెవెన్యూ సహాయకులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. తరతరాలుగా కామ్దార్ పని చేస్తూ తగిన వేతనం అందుకోని వారికీ పేస్కేల్ ఇవ్వనున్నది. కేసీఆర్ సర్కారు నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 3 వేల మందికి పైగా లబ్ధి కలుగనున్నది. దీంతో గ్రామ రెవెన్యూ సహాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమకు తగిన గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు శుక్రవారం ఊరూరా క్షీరాభిషేకాలు చేశారు.
నిజామాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజుల క్రితమే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వీఆర్ఏలను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని ప్రకటన చేసింది. ఇందులో భాగంగా గురువారం నూతన సెక్రటేరియేట్లో జరిగిన తొలి మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా రు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపు 3,200 మందికి లబ్ధి చేకూరబోతున్నది. వీఆర్ఏలుగా ఉభయ జిల్లాల్లో వందలాది మంది పని చేస్తున్నారు. ఇందులో కొద్ది మందిని ప్రభుత్వం నియామకం చేపట్టగా అనేక మంది తరతరాలుగా వంశపారంపర్యంగానే వీఆర్ఏగా కొనసాగుతున్నారు. వీరంతా గౌరవ వేతనంపై జీవనం సాగిస్తున్నారు. త్వరలోనే వీరి ఉద్యోగం కాస్త క్రమబద్ధీకరణకు నోచుకోనుండడంతో వందలాది మందికి లాభం జరుగనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వీఆర్ఏల్లో సంతోషం వెల్లువెత్తుతున్నది.
ఫలించిన కల…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వీఆర్ఏల వ్యవస్థ వేళ్లూనుకున్నది. వీరు పల్లెల్లో ప్రజల సేవలో నిమగ్నం అవుతూ ఉన్నారు. చాలా మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు ఉద్యోగాలు వారసత్వంగా దక్కుతున్నాయి. మరికొందరిని గతంలో ప్రభుత్వమే నియమించింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 1800 వీఆర్ఏలు పని చేస్తున్నారు. వీరిలో 1300 మంది వరకు వారసత్వంగా ఉద్యోగాలు దక్కించుకున్నవారే ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 1469 మంది వీఆర్ఏలు ఉండగా అగ్రభాగంలో వారసత్వంగా ఉద్యోగం పొందిన వారున్నారు. వీరంతా అనేక ఏండ్లుగా ప్రభుత్వం ద్వారా ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు. ఇచ్చిన హామీ మేర కు ప్రభుత్వం ఎట్టకేలకు వీరి చిరకాల కోరికను నెరవేర్చిం ది. వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో వారంతా సంతోషంలో మునిగితేలుతున్నారు.
ఆయా శాఖల్లో సర్దుబాటు…
వీఆర్ఏలను ఖాళీలను బట్టి రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. చాలా మంది వారసత్వ పద్ధతిన వీఆర్ఏలుగా కొనసాగుతున్నారు. విద్యార్హతను బట్టి వీఆర్ఏలకు ఆయా శాఖల్లో బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలిసింది. గతేడాది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో) విషయంలో ప్రభుత్వం వివాదరహితంగా ఆయా శాఖల్లో సర్దుబాటు చేసింది. ఖాళీలను గుర్తించి అందులో లాటరీ పద్ధతిలో వీఆర్వోలకు పోస్టింగ్లు ఇ చ్చారు. డిగ్రీ కలిగిన వారికి జూనియర్ అసిస్టెంట్లు, ఇంట ర్ వారికి రికార్డు అసిస్టెంట్లు, పదో తరగతి అంతకన్నా తక్కువ అర్హత కలిగిన వారికి ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. శాఖలు, పోస్టుల కేటాయింపు వ్యవహారంపై కొద్ది రోజుల్లోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం స్పష్టతను ఇవ్వబోతున్నది. ప్రస్తుతం వీఆర్ఏలు గౌరవ వేతనం కింద రూ.11,600 పొందుతున్నారు. క్రమబద్ధీకరణతో వేతనం పెరగడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా సేవలందించనున్నారు. జీవితాంతం ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగ భద్రతను దక్కించుకోబోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు…
మంత్రి వర్గ సమావేశం తీసుకున్న నిర్ణయంతో వీఆర్ఏలు సంబురాలు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో అనేక మంది గ్రామ రెవెన్యూ సహాయకులంతా కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఏండ్ల నుంచి డిమాండ్ చేస్తున్న తమ కోరికను నెరవేర్చిన కేసీఆర్కు రుణపడి ఉంటామంటూ వారంతా ప్రకటించారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఉద్యోగ క్రమబద్ధీకరణతో తమ జీవితాల్లో కొంగొత్త వెలుగులను కేసీఆర్ నింపారని ఆనందంగా తెలియజేస్తున్నారు. వీఆర్ఏ వ్యవస్థను గతంలోని ప్రభుత్వాలు కేవలం వెట్టిచాకిరి మాదిరిగానే వాడుకున్నాయని ఎక్కడా తమ బతుకుల గురించి ఆలోచించలేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలోనే వీఆర్ఏల ఆత్మగౌరవానికి విలువ దక్కిందని చెబుతున్నారు.
కష్టాన్ని గుర్తించిన సీఎం
వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడం హర్షణీయం. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్న కల క్రమబద్ధీకరణతో నెరవేరనున్నది. చాలా సంతోషంగా ఉంది. వీఆర్ఏలకు సీఎం కేసీఆర్పై ఎంతో నమ్మకం ఉండే. కష్టపడే వారిని సీఎం కేసీఆర్ తప్పకుండా గుర్తిస్తారని మరోసారి రుజువైంది. ఈ అంశాన్ని క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, స్పీకర్ శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
-బండారి రవి, వీఆర్ఏ
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు..
బాన్సువాడ : వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. నాడు స్వరాష్ట్రం కోసం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొన్నాం. ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్న కోరిక సీఎం కేసీఆర్ ప్రకటనతో నెరవేరబోతున్నది.
-రజినీకాంత్, కొల్లూర్
మాట తప్పని సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పని నాయకుడు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని గతంలో మాట ఇచ్చారు.. ప్రస్తుతం ఆ మాటను నిలబెట్టుకున్నారు. మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– వేణుయాదవ్, వీఆర్ఏ
మరింత కష్టపడతాం..
బీర్కూర్ : వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించడం హర్షణీయం. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. మరింత ఉత్సాహంతో పని చేసేందుకు సిద్ధంగా ఉంటాం.
-విజయ్కుమార్, వీఆర్ఏ కిష్టాపూర్