కమ్మర్పల్లి, మార్చి 25: రైతుల మేలు కోసం పీఏసీఎస్లకు ఎన్నో సేవలందించిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసమేనా అని కోనసముందర్ పీఏసీఎస్ చైర్మన్ సామ బాపురెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన కోనసముందర్ పీఏసీఎస్లో విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా వేముల ప్రశాంత్రెడ్డి సొసైటీలు, రైతులకు వెల కట్టలేని సేవలందించారన్నారు. ఆయనపై విమర్శలు చేయడం సమంజసమేనా అని కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రశాంత్రెడ్డిపై తమ స్థాయిని మరిచి కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ముందుగా రైతులకు యాసంగి వడ్లకు రూ.500 బోనస్ ఇప్పించాలన్నారు. రూ.15,000 రైతుబంధు ఇస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కోనసముందర్ సొసైటీలో 20 యాసంగి వడ్ల కుప్పలు సిద్ధంగా ఉన్నాయని, వాటికి బోనస్ ఎప్పుడు ఇస్తారో, కాంటలు ఎప్పుడూ పెట్టిస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను సొసైటీలో రూ.80లక్షల అక్రమాలకు పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. వారు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే ముక్కు భూమికి రాకుతారా అని సవాల్ విసిరారు. నిరూపిస్తే తాను ముక్కు భూమికి నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, మాజీ వైస్చైర్మన్ నవీన్యాదవ్ పాల్గొన్నారు.