ప్రభుత్వ వైద్యం.. మరింత విస్తృతం
ఉమ్మడి జిల్లాలోని నాలుగు దవాఖానల్లో ఉచితంగా డయాలసిస్ సేవలు
తాజాగా ఆర్మూర్ వైద్యశాలకు రక్తశుద్ధి కేంద్రం మంజూరు
త్వరలో భీమ్గల్లోనూ ఏర్పాటయ్యే అవకాశం
వైద్యానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కారు
ఎంతో మంది రోగులకు పునర్జన్మనిస్తున్న వైనం
వైద్య సేవలను విస్తృతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తున్నది. రూ.లక్షల విలువ చేసే కార్పొరేట్ స్థాయి చికిత్సలను కూడా ఉచితంగానే అందిస్తున్నది. విద్యతో పాటు వైద్యానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్.. మారుమూల ప్రాంతాలకు సైతం అధునాతన వైద్య సేవలను విస్తరిస్తున్నారు. తాజాగా ఆర్మూర్లోని వంద పడకల దవాఖానకు డయాలసిస్ సెంటర్ను మంజూరు చేశారు. గతంలో డబ్బున్న వారికి మాత్రమే సొంతమైన డయాలసిస్ సేవలు.. కేసీఆర్ చొరవతో పేదలకు చేరువయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నాలుగు వైద్యశాలల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లు.. వందలాది మంది రోగుల ప్రాణాలు నిలబెడుతున్నాయి. తాజాగా ఆర్మూర్లో రక్తశుద్ధి కేంద్రం ఏర్పాటు కానుండడంతో ఆర్మూర్, భీమ్గల్ నియోజకవర్గాల ప్రజలకు మరింత సౌలభ్యం కలుగనున్నది.
ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున అందిస్తున్న డయాలసిస్ సేవలు..
జీజీహెచ్ నిజామాబాద్ – 1300
బోధన్ జిల్లా దవాఖాన -400
కామారెడ్డి జిల్లా వైద్యశాల – 500
బాన్సువాడ ప్రాంతీయ దవాఖాన – 550
నిజామాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. వారి బతుకులకు కొండంత అండగా ఉంటున్నది. డయాలసిస్ సేవలు పొందాలంటే గతంలో డబ్బున్న వారికి మాత్రమే సొంతమైన వైద్యమిది. కానీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత కార్పొరేట్ స్థాయి హంగులతో రూపాంతరం చెందిన సర్కారు దవాఖానలు ఇప్పుడు కొంగొత్తగా నిలుస్తున్నాయి. ఎందో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ గడిచిన ఎనిమిదేండ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారు. ఇందు లో ప్రతి జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లను భారీగా ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాలో ప్రాం తీయ దవాఖానలకు సైతం వీటిని విస్తరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన, బోధన్ ఏరియా దవాఖాన, కామారెడ్డి జిల్లా దవాఖాన, బాన్సువాడ ఏరి యా దవాఖానల్లో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. 100 పడకల దవాఖానగా రూపాంతరం చెందిన ఆర్మూర్లోనూ డయాలసిస్ కేంద్రాన్ని నెలకొల్పుతూ నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తమవుతుండగా వచ్చే ఏడాది భీమ్గల్లోనూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ప్రాణాలు నిలుపుతున్న ప్రభుత్వం..
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రోజు తప్పించి రోజు లేదంటే మూడ్నాలుగు రోజులోసారి రక్త శుద్ధి చేయించడం తప్పనిసరి. రక్తాన్ని శుద్ధి చేయించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో క్రమంగా పెరుగుతున్నది. ఇలాంటి వారు వైద్యం చేయించుకోవాలంటే గతంలో ప్రైవేటు దవాఖానలే దిక్కు అయ్యేది. అక్కడ ఒక్కసారి చికిత్స చేయించుకుంటే వేలల్లో ఖర్చయ్యే దుస్థితి ఏర్పడేది. తద్వారా పేద కుటుంబాలకు చెందిన వారైతే బిల్లులు చెల్లించలేక అప్పులు చేసే పరిస్థితి ఉండేది. ప్రభుత్వమే డయాలసిస్ సెంటర్లను నెలకొల్పడం ద్వారా ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి ప్రతి నెలా సేవలు అందుతున్నాయి. నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన చాలా మంది పొద్దున లేవగానే బస్సెక్కి లేదంటే రైలెక్కి హైదరాబాద్కు పోయేది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి పెద్దాసుపత్రుల్లో డ యాలసిస్ చేసుకొని తిరిగి ఇంటికి చేరేందుకు స మయంతోపాటు డబ్బులు భారీగా వెచ్చించేది. ఇప్పుడు చాలా మందికి ఉపశమనం దక్కుతున్నది. స్థానికంగానే డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలంతా కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
భారీగా రద్దీ..
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రతి నెలా సరాసరి 1300 మందికి డయాలసిస్ సేవలు అందుతున్నాయి. రోజుకు సగటున 40 నుంచి 50 మందికి రక్తశుద్ధి జరుగుతున్నది. మొత్తం 125 మంది రోగులు ఇక్కడ సేవలు పొందుతున్నారు. నిర్ణీత సమయాల్లో దవాఖానకు వచ్చి రక్తశుద్ధి చేయించుకొని ప్రాణాలు నిలుపుకొంటున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు నిర్మల్ జిల్లా నుంచి రక్తశుద్ధి కోసం వస్తున్నారు. బోధన్ జిల్లా దవాఖానలో 43మంది రోగులు రిజిష్టర్ చేయించుకున్నారు. నిత్యం 15 నుంచి 20 మందికి సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా 400 మందికి రక్తశుద్ధి జరుగుతున్నది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దవాఖానలో రోజుకు 20 మందికి చికిత్స అందుతున్నది. నెలకు 500 డయాలసిస్ జరుగుతున్నట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు. బాన్సువాడలో నెలలో దాదాపుగా 550 డయాలసిస్ చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ మేరకు వారంలో రెండు సార్లు లేదంటే మూడు సార్లు రక్తశుద్ధి జరుగుతున్నది. ఇక్కడ 53మంది రోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. బాన్సువాడకు వచ్చే కిడ్నీ బాధితుల్లో జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాలకు చెందిన వారున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సిరిసిల్లా, మెదక్ జిల్లాల నుంచి వస్తున్నారు.
వచ్చే ఏడాది భీమ్గల్లో..
బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్లో 100 పడకల దవాఖానకు మంత్రులు తన్నీరు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఈ మధ్యే శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో వైద్యారోగ్య మంత్రికి స్థానిక మంత్రి వేముల ఓ వినతిని సమర్పించారు. 100 పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించి డయాలసిస్ సెంటర్ తప్పనిసరిగా వస్తుందని హామీ ఇచ్చారు. భీమ్గల్లో యుద్ధ ప్రాతిపదికన దవాఖాన నిర్మాణం చేపట్టబోతున్నారు. సరిగ్గా ఏడాదిన్నర కాలంలోనే భవన నిర్మాణం పూర్తయితే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. వెనువెంటనే రక్తశుద్ధి కేంద్రం సైతం ఏర్పాటు అవుతుంది. తద్వారా ప్రస్తుతం ఆర్మూర్, నిజామాబాద్ పెద్దాసుపత్రుల వైపు చూస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని సగం మండలాల జనాలకు భీమ్గల్ 100 పడకల దవాఖాన పెద్ద దిక్కుగా నిలవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో నాలుగు డయాలసిస్ సెంటర్లుండగా ఆర్మూర్తో ఈ సంఖ్య ఐదుకు చేరింది. వచ్చే ఏడాది భీమ్గల్లో సెంటర్ ఏర్పాటైతే ఆరుకి చేరే అవకాశం ఉన్నది.
ఆర్మూర్లోనూ డయాలసిస్..
పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానలో అత్యవసర సేవల విభాగం(ఐసీయూ), డయాలసిస్(రక్తశుద్ధి) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. దూర ప్రాంతాలకు వైద్య సేవల కోసం వెళ్లాల్సిన గత్యంతరం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నది. డయాలసిస్ సేవల పేరుతో గతంలో ప్రైవేటు దోపిడికి గురైన వారంతా ఇప్పుడు నయా పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వ దవాఖానల్లో రక్తశుద్ధి చేయించుకుంటున్నారు. అధునాతన వైద్యం అందుతుండడం తో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం కేసీఆర్ 100 పడకల దవాఖానగా ఉన్నతీకరించారు. ప్రసవాల్లో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచిన ఈ దవాఖానకు మరిన్ని సేవలు తోడవుతున్నాయి. ఆర్మూర్లోని ఏరియా దవాఖానతో బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వారికి భారీగా లాభం జరుగుతున్నది. ఈ ప్రాంతాలకు చెందిన వారు ప్రస్తుతం రక్తశుద్ధి కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తున్నది. ఆర్మూర్లో డయాలసిస్ సేవలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో త్వరలోనే సేవలు ప్రారంభం కాబోతున్నాయి. స్థానికులకు భారీ ఊరట దక్కబోతున్నది. బాల్కొండ, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్గల్, నందిపేట, ఆర్మూర్, మాక్లూర్, జక్రాన్పల్లి మండలాలకు చెందిన వారెందరికో ఆర్మూర్ దవాఖాన పెద్ద దిక్కుగా మారబోతున్నది.