ధర్పల్లి, డిసెంబర్ 12 : తెలంగాణ ప్రాంతంలో చేసుకోవడానికి ఉపాధి లేక.. పండించుకోవడానికి సరైన నీటి వనరులు లేక, వ్యవసాయ పనులు దొరకక మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లేవారు. ఇది గతం… ప్రస్తుతం పరిస్థితులు మారాయి. స్వరాష్ట్ర సాధనతో తెలంగాణలో జీవన విధానం మెరుగుపడింది. వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధినందిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూలీలు వలస వచ్చి తెలంగాణలో వరినాట్లు ఇతరత్రా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
ఇందూరు గడ్డ వలస కూలీలకు అడ్డాగా మారింది. పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న వారికి దండిగా ఉపాధి కల్పిస్తున్నది. వ్యవసాయానికి ప్రసిద్ధి గాంచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటల సాగు ఊపందుకున్నది. కాలం కలిసి రావడంతో రైతాంగం ఉత్సాహంగా ముందుకు ‘సాగు’తున్నది. కేసీఆర్ సర్కారు 24 గంటలపాటు ఉచిత కరెంట్ ఇవ్వడంతోపాటు ఎరువులు, విత్తనాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. ప్రభుత్వ చేయూతతో అన్నదాతలు ఆనందంగా పంటల సాగులో నిమగ్నమయ్యారు. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పాలకులు పట్టించుకోక పోవడంతో అక్కడి రైతులు, కూలీల పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఉపాధి కోసం వలస బాట పట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల కూలీలకు తెలంగాణ ఉపాధి కేంద్రంగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకుని ఇక్కడకు వస్తుండడం కమలం పార్టీ పాలన తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. వలస కూలీలను ఆదరిస్తున్న ఉమ్మడి జిల్లా రైతులు.. వారికి చేతినిండా పని కల్పిస్తున్నారు.
ఊపందుకున్న వరినాట్లు.. వలస కూలీలకు ఉపాధి
వానకాలం పంట ముగిసిందో లేదో ప్రస్తుతం యాసంగి సాగు పనులు వేగవంతమయ్యాయి. వరి పంట విక్రయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సొసైటీలు, ఐడీసీయంయస్, ఐకేపీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసింది. రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం రైతులంతా యాసంగి వరి నాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పనులు జోరందుకోగా.. యూపీ నుంచి వలస వచ్చిన మగ కూలీలు వరినాట్లు వేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
ఎకరానికి 4 నుంచి 5 వేల వరకు కూలీ..
యూపీ నుంచి వలస వచ్చిన కూలీలు ఎకరానికి 4 నుంచి 5వేలు, 5,500ల వరకు రైతుల నుంచి డబ్బులు తీసుకొని నాట్లు వేస్తున్నారు. దీంతో యాసంగి సీజన్లో ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరూ అన్ని ఖర్చులు పోనూ 20 నుంచి రూ.40వేల వరకు సంపాదించుకొని వెళ్తున్నారు. చేతినిండా ఉపాధి దొరుకుతుండడంతో వలస కూలీలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
డబుల్ ఇంజిన్కే ఉపాధి చూపిన తెలంగాణ..
బీజేపీ పాలిస్తున్న యూపీ, మధ్యప్రదేశ్లాంటి రాష్ర్టాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి.. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయాభివృద్ధికి పాటుపడుతుండడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది డబుల్ ఇంజిన్ అని చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది. యూపీ, మధ్యప్రదేశ్ నుంచి పొట్ట చేత పట్టుకొని వస్తున్న కూలీలకు ఉపాధినందిస్తూ ఆధారమవుతున్నది.
నాలుగు రాళ్లుసంపాదించుకోగలుగుతున్నాము..
(అప్నా రాజ్య్ మే కామ్ నహీ మిల్రే.. ఇస్లియే ఇదరాకే కామ్ కార్ రహహే, చార్ రూపియా బచ్రే) మా యూపీ రాష్ట్రంలో సరైన పనులు లేక ఇక్కడికి వలస వచ్చాం. ఇక్కడ ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగిలో రెండు నెలలు పనులు చేసుకొని నాలుగు రాళ్లు వెనుక వేసుకొని సంతోషంతో ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ పని లభించడం ఎంతో సంతోషంగా ఉంది.
– కార్తిక్, వలస కూలీ, యూపీ
రూ.30-40 వేలు సంపాదిస్తున్నాం..
యూపీ నుంచి ప్రతి సీజన్కు ఇక్కడికి వచ్చి వరినాట్లు వేసుకుంటూ ఉపాధి పొందుతున్నాను. ఎకరానికి రూ.4వేల నుంచి 5, 6 వేల వరకు గుత్త మాట్లాడుకొని నాట్లు వేస్తాం. రోజుకు 10, 12 మంది కలిసి 10, 12 ఎకరాల వరకు నాట్లు వేస్తాం. దీంతో ప్రతి సీజన్లో ఒక్కొక్కరం సుమారు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు సంపాదించుకోగలుగుతున్నాము. వరినాట్ల పనులతో ఉపాధి లభించడం సంతోషంగా ఉంది.
– సుకుమార్, వలస కూలీ, యూపీ