పిట్లం, మార్చి 15: నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరిగిందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయంటే అది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి తెచ్చిన పరిశ్రమలతో వచ్చిన సంపదతోనే సాధ్యమయ్యిందన్నారు.
నాడు రామునికి హనుమంతుని మాదిరిగా నేడు మీకు నేను సేవచేస్తానని, ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు సేవచేయాలన్నదే తన ఆశయమని షిండే అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, స్పీకర్ పోచారం సహకారంతో నియోజకవర్గంలో రూ.500 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిలు 8 సంవత్సరాల్లో నిర్మించుకున్నామన్నారు. నాగమడుగు లిఫ్టును మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజలందరం చేతులెత్తి నమస్కరిస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ బాన్సువాడ వచ్చినప్పుడు జుక్కల్ నియోజకవర్గానికి 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు, 4 సబ్స్టేషన్లు కోరగా వీటిలో 135 కేవీ సబ్స్టేషన్ను తక్షణమే అధికారులకు ఫోన్ చేసి మంజూరు చేయించారన్నారు. తాను ఎమ్మెల్యే అయిన అనంతరం 70 గ్రామాలకు బీటీరోడ్లు వేసుకున్నామని మరో 11 గిరిజన తండాలకు బీటీరోడ్లు పంచాయతీరాజ్ శాఖతో వేయాల్సి ఉందన్నారు. మాగి దగ్గర నుంచి ఒడ్డేపల్లి – మల్లూర్ – అన్నారం రహదారిని డబుల్ లైన్ రోడ్డుగా మార్చేందుకు రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. నియోజకవర్గంలో రెండు బ్రిడ్జిలకు నిధులు అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరారు. మండలంలోని పురాతనమైన రామలింగేశ్వరాలయానికి రూ.2.5 కోట్లు, కౌలాస్ కోటకు రూ.2 కోట్లు, సలాబత్పూర్ హనుమాన్ ఆలయానికి రూ.2.5 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషిచేయాలని కోరారు.
మద్నూర్, పిట్లం మండలాలకు డిగ్రీ కళాశాలలు, నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాలకు జూనియర్ కళాశాలలు, పిట్లం, బిచ్కుంద షాదీఖానలకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. పిట్లం, జుక్కల్కు బంజారా భవన్లు మంజూరు చేయాలని కోరారు. లెండి ప్రాజెక్టుపై రూ.150 కోట్లతో చెక్డ్యాం నిర్మిస్తే లిఫ్టు ద్వారా 22 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు. నియోజకవర్గంలోని మహ్మద్నగర్ను మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు.