వర్ని, మే 27: శత జయంతి ఉత్సవాలకు కూడా ప్రజాదరణ తగ్గకుండా, ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సభాపతి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు విశిష్ట అతిథిగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, అతిథులుగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావ్, మండవ వెంకటేశ్వరరావ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. సుస్థిర పాలన అందించిన ఘనత కేవలం ఎన్టీఆర్కే దక్కిందన్నారు.
ఆరునెలలకొక ముఖ్యమంత్రి మారుతున్న నేపథ్యంలో ప్రజలకు సుస్థిర పాలన అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్కు వారసుడిగా ప్రజలకు సుస్థిర పాలన అందించే విధంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. నిరుపేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. నిరుపేదలకు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇండ్లు, జనతా వస్ర్తాలు పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. రాష్ట్రంలో విద్యుత్ స్లాబ్ విధానాన్ని దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ఏకైక సీఎం ఎన్టీఆర్ అని అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ను జీవితాంతం మరువబోనన్నారు. ప్రతి వ్యక్తిని మీరు అని సంభోదించి గౌరవించిన సంస్కారవంతుడు తారకరామారావు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్ని ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో -ఆప్షన్ మెంబర్ కరీం, బోధన్ కమ్మ సంఘం అధ్యక్షుడు శివన్నారాయణ, వర్ని మండల కమ్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు వర్ని సీసీడీ నుంచి అతిథులను ర్యాలీగా సభాస్థలివరకు తీసుకువచ్చారు. అనంతరం స్పీకర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం కొనసాగింది. వర్ని కమ్మ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.