బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 30: ఆరు గ్యారెంటీల పేరిట వంచించిన కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయని వైనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, పార్టీతో కలిసి నడిచేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని జనాలకు సరైన పద్ధతిలో అవగాహన కల్పించాలని సూచించారు. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ అందిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అడగాలన్నారు. స్వార్థం కోసం పార్టీ మారిన వారిని పట్టించుకోవద్దని, నిస్వార్థమైన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సొంతమని చెప్పారు. ఈ నెల 4వ తేదీన బాన్సువాడలో నిర్వహించనున్న రోడ్ షోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, 7న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని కోరారు. ఎంతో మంది నాయకులకు పదవులు ఇచ్చి అన్ని రకాలుగా అండగా ఉన్నామని, కానీ విశ్వాసం లేని కొందరు అధికారం పోగానే బీఆర్ఎస్ను వీడుతున్నారని నియోజకవర్గ ఇన్చార్జి భాస్కర్రెడ్డి విమర్శించారు. అధికారం కోసం పార్టీలు మారే వారిని ప్రజలే శిక్షిస్తారన్నారు. పోచారం కుటుంబం మీద ప్రజలు, కార్యకర్తల్లో పూర్తి విశ్వాసం ఉందని, అందుకే గత ఎన్నికల్లో మంచి మెజార్టీ వచ్చిందని, అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చే లా పని చేయాలని కోరారు. బాన్సువాడ ము న్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నేతలు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహులు, ఎజాస్, వెంకట్రాంరెడ్డి, గోపాల్రెడ్డి, వాహెబ్, శ్రీనివాస్, మోహన్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.