నిజామాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కళ తప్పిన కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ఆర్థికంగా చితికి పోతున్న బతుకులకు అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కనుమరుగయ్యే దశకు చేరాయి. అయితే, తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఇప్పటికే గొల్ల కురుమలు, మత్స్యకారులు, చేనేత, గౌడ, నాయీ బ్రాహ్మణులు, దళిత కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఈ క్రమంలోనే మరో ప్రతిష్టాత్మక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. కుల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నది. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్న ఈ పథకం విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి చోటు దక్కింది. రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మత్స్యకారులు, గొల్ల, కురుమలు, దళిత కుటుంబాలు, చేనేత కార్మికులు, గౌడన్న తదితర వృత్తిదారులకు కొండంత అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ప్రతిష్టాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఇందులో కులవృత్తిదారులకు సాయం అందించడమే ముఖ్య ఉద్దేశంగా కేసీఆర్ సర్కారు పథకాన్ని రచిస్తున్నది. సామాజిక న్యాయం అందించేందుకు కుల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. విధివిధానాల ఖరారుకు మంత్రులతో సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. బీసీలకు బాసటగా నిలిచేందుకు తీసుకువస్తున్న ఈ పథకంపై కుల వృత్తిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2014-18 మధ్య కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వందలాది మందికి రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం రాయితీతో బ్యాంకు లింకేజీలు లేకుండా సాయం చేసింది. తాజాగా కొత్త పథకం ద్వారా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి లబ్ధి చేకూరబోతున్నది.
సహాయంలో కేసీఆర్ పెద్దన్న పాత్ర…
గతంలో దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన వాళ్లంతా రుణ ఆధారిత పథకాలను అమలు చేశారు. బొటాబొటిన మంజూరు చేసే యూనిట్లలో లబ్ధిదారుడి వాటానే కీలకంగా ఉండేది. సగటు పేద కుటుంబానికి చెందిన వ్యక్తి తన వాటాను చెల్లించేందుకు చేతులు ఎత్తేసే పరిస్థితి. ఫలితంగా పథకానికి దూరంగా జరిగిపోయేవారు. లేదంటే అప్పులు చేసి లబ్ధిదారుడు వాటా చెల్లించేది. బ్యాంకు రుణం జత కూడి మొత్తం రుణ సదుపాయం మంజూరుకు నెలలు పట్టేది. దీంతో తెచ్చిన అప్పుపై వడ్డీల భారంతో లబ్ధిదారుడికి లాభం కన్నా నష్టం జరిగేది. రుణం మంజూరు అయ్యేలోపే యూనిట్ స్థాపించుకునే ఆలోచన నుంచి బయట పడేందుకు లబ్ధిదారుడు ప్రయత్నించే పరిస్థితులు ఎదురయ్యేవి. వ్యక్తి ప్రయోజనం కాకుండా పథకాన్ని మమ అనిపించేలా అమలుచేసేందుకు సమైక్య పాలకులు నీతిమాలిన విధానాలను అమలు చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో లబ్ధిదారుడి వాటాతో ఆర్థిక సాయం అందే పథకాలు చాలా తక్కువ. లబ్ధిదారుడి వాటా ఉన్నప్పటికీ అది అత్యంత స్వల్పమే. వంద శాతం రాయితీతో ఆర్థిక బలాన్ని చేకూర్చడమే కేసీఆర్ పథకాల్లోని ముఖ్యోద్దేశం. అలా తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మత్య్సకారులకు ఉచిత చేపపిల్లల పంపణీ, దళితబంధు, రైతుబంధు ఇలా అనేక పథకాల్లో ఇదే ఒరవడి కనిపిస్తున్నది. తాజాగా కేసీఆర్ ప్రకటించిన కులవృత్తిదారులకు రూ.లక్ష సాయంలోనూ వంద శాతం రాయితీ ఉన్నది.
మంత్రి వేముల… కీలక భూమిక…
కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాల వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులవ్తత్తులు చేస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాల రూపకల్పనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో సబ్ కమిటీ నియామకమైంది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన బాల్కొండ ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితోపాటుగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. విధివిధానాలు ఖరారై, లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరిగితే వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లోనే ఆయా వర్గాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కీలకమైన పనుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భాగస్వామ్యమవుతున్నారు. రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయ నిర్మాణం, అమరవీరుల స్తూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటు.. ఇలా అనేక ప్రతిష్టాత్మకమైన కట్టడాల్లో మంత్రి వేముల ఉండడం జిల్లా ప్రాధాన్యతను తెలియజేస్తున్నది. తాజాగా బడుగు బలహీనవర్గాలకు మేలు కోసం తలపెట్టబోతున్న కీలకమైన పథకంలోనూ వేముల ప్రశాంత్రెడ్డి ప్రాతినిధ్యం ఉండడం విశేషం.
బలహీనవర్గాలకు బాసట కేసీఆర్
బలహీనవర్గాలను ఉన్నతస్థానానికి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారు. అందులో భాగంగానే దళిత సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు దళితబంధును తీసుకువచ్చి విజయవంతంగా అమలుచేశారు. ఇప్పుడు కుల వృత్తిదారుల కోసం ఆలోచన చేయడం గొప్ప విషయం. తొలి ప్రభుత్వంలోనూ చాలా మంది బీసీలకు వంద శాతం రాయితీతో రుణాలు అందించిన ఘనత కూడా కేసీఆర్ సర్కారుకే దక్కింది.
– మారయ్య గౌడ్, విద్యావేత్త
బీసీలకు మంచి రోజులు..
సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో మేథోమధనం ద్వారా గుర్తించి వాటికి విరుగుడుగా సహాయాన్ని అందించడంలో కేసీఆర్ మేటి. వృత్తిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరేలా రూ.లక్ష సాయం అందిస్తామని చెప్పడం, విధివిధానాలకు సబ్ కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరం. కేసీఆర్ కమిట్మెంట్కు హ్యాట్సాఫ్.
– నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు
వృత్తిదారులకు ప్రయోజనం…
వృత్తిదారులకు న్యాయం చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించినది లేదు. గత ప్రభుత్వాల్లో కులవృత్తిపై ఆధారపడిన వారిని ఆదుకున్న వారు లేరు. అసలు వారి గురించి ఆలోచన చేసిన వాళ్లే కనిపించలేదు. గౌడన్నలకు జీవిత బీమా సౌకర్యం తీసుకువస్తామని ప్రభుత్వం చెప్పింది. తాజాగా కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం చేస్తామనడం శుభపరిణామంగా భావిస్తున్నాం.
– జయసింహా గౌడ్, ట్రస్మా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా