కామారెడ్డి/ఖలీల్వాడి, ఏప్రిల్ 27 : ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కంటి వెలుగు శిబిరాల గురించి వైద్యులు, ప్రజాప్రతినిధులు ముందుగానే అవగాహన కల్పించడంతో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఉదయాన్నే శిబిరాలకు చేరుకొని నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది ప్రజలను పరీక్షించి అవసరం ఉన్న వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. కంటి వెలుగు కేంద్రాలను తమకు అందుబాటులో ఏర్పాటు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కళ్ల అద్దాలు అందుబాటులో లేకపోతే ఆర్డర్ పెట్టి వచ్చిన వెంటనే అందజేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయని డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్ తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 4847 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 387 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 3,47,375 మందికి పరీక్షలు నిర్వహించి 51,410 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. 8060 మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించగా 599 మందికి అద్దాలు అందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 5,06,708 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 83,894 మందికి అద్దాలు అందించామని తెలిపారు.
కేసీఆర్ సారు సల్లగుండాలి
నాకు రెండు కళ్లు సరిగ్గా కనిపిస్తలేవు. దవాఖానలో చూపిద్దామనుకుంటే చేతిలో పైసలులేవు. దవాఖానలో చూపించుకుంటే చాలా ఖర్చు అవుతదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.
– కొర్వ సాయవ్వ, నెమ్లి
నిరుపేదలకు ఎంతో ఉపయోగం
కంటి వెలుగు శిబిరం నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ కంటి పరీక్షలను ఉచితంగా చేయించడం సంతోషించాల్సిన విషయం. ప్రైవేటు దవాఖానల్లో పరీక్షలు చేయించుకుంటే వేలల్లో ఖర్చు అవుతాయి. కానీ కంటి వెలుగు శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి, అద్దాలను సైతం అందజేయడం చాలా సంతోషంగా ఉంది.
– శంకర్ యాదవ్, నెమ్లి
సారును బతికినన్ని దినాలు యాది బెట్టుకుంటా
నాకు కండ్లసూపు సక్కగ అగుపిస్తలేదు. ఊర్ల కండ్ల పరీచ్చలు జేస్తున్నరంటే ఈడికి అచ్చిన. డాక్టర్లు చూసి కండ్లద్దాలు ఇచ్చిండ్రు. గిప్పుడు మంచిగ కనవడ్తుంది. కడుపున పుట్టిన కొడుకులు కూడా పట్టించుకుంటలేరు ఈ కాలంల. గనీ గ కేసీఆర్ సారు మాత్రం అందరి గురించి ఆలోచన జేస్తుండు. సూపు సక్కగుంటేనే పనులు జేసుకుంటామని మా అసుంటోళ్ల కోసం గిట్ల కంటి పరీచ్చలు ఫిరీగా చేయిస్తుండు. మునుపు ఏ సర్కారు గుడ గిట్ల ఆలోచన జెయ్యలె. గ సారును బతికినన్ని దినాలు యాది బెట్టుకుంటాం.
– లోత్మల్ల సత్తెవ్వ, నెమ్లి, నస్రుల్లాబాద్ మండలం