కోటగిరి/ ఖలీల్వాడీ(మోపాల్)/ నిజాంసాగర్, జన వరి 24: దృష్టి లోపాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వారికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి, అవసరమైనవారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కంటి వెలుగుపై అవగాహన కల్పిస్తున్నారు. కంటి సమస్యతో బాధపడేవారిని శిబిరాలకు తరలిస్తున్నారు.
మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు పలు మండలాల్లో పర్యటించారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మోపాల్ మండలంలోని ముదక్పల్లి, న్యాల్కల్ గ్రామాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో కంటి శిబిరాలను తనిఖీ చేశారు.నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భోజన సదుపాయాలు, రవాణా వసతి గురించి వైద్యబృందాలను అడిగి ఆరా తీశారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట కంటి వెలుగు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్, తహసీల్దార్ లత, ఎంపీవో ఇక్బాల్ ఉన్నారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు, మండలంలో ఎన్ని శిబిరాలు ఏర్పాటుచేశారు తదితర వివరాలను తెలుసుకొన్నారు. గ్రామాల్లో ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యుడు రోహిత్ తదితరులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 14,293 మందికి పరీక్షలు..
7937 మందికి కళ్లద్దాల పంపిణీ
విద్యానగర్/నిజామాబాద్ జనవరి 24: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 5558 మందికి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు. 1570 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.ఇప్పటి వరకు 21,206 మందికి పరీక్షలు నిర్వహించి 5094 మంది కళ్లద్దాలను అందించామన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 8735 మంది కంటి పరీక్షలు నిర్వహించి, మందికి అద్దాలను అందచేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు.
నిమిషాల్లో కళ్లద్దాలు ఇచ్చారు..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంతో మా లాంటి వాళ్ల బాధలు తీరాయి. నేను శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నాను. వైద్యసిబ్బంది నిమిషాల వ్యవధిలో నా కు కళ్లజోడు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది.
-కర్నె రాజేందర్, కోటగిరి
ఇద్దరికీ పరీక్షలు చేసి మందులు ఇచ్చిండ్రు
కంటి వెలుగు కార్యక్రమం లా బాగుం ది. భార్యాభర్తలిద్దరం కం టి పరీక్షలు చేయించుకున్నాం. కళ్లజోడు, మందులను ఉచితంగా ఇచ్చారు. గ్రామంలోనే శిబి రం ఏర్పాటుచేయడంతో పేదలకు ఎంతో ఉపయోగం.
– సాదక్ కురేసీ-రహెనా, కోటగిరి
నయాపైసా ఖర్చుకాలేదు..
ఏది చదవాలన్నా.. రాయాలన్నా.. ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కళ్ల పరీక్ష చేయించుకున్నా. కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇచ్చిన కళ్లజోడు పెట్టుకున్న తర్వాత దగ్గరి చూపు బాగా కనిపిస్తున్నది.
– సుంకిని మారుతీ పటేల్, కోటగిరి