ఖలీల్వాడి, జనవరి 19 : దృష్టి లోపాలను దూరం చే యాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ .. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో ఉన్న స్త్రీ స్వశక్తి భవన్లో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి వేముల గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శిబిరంలో నేత్ర పరీక్షలు చేయించుకొని కంటి అద్దాలను తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయం, ఓట్ల కో ణం అసలే లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా, గిన్నిస్ రికార్డును నమోదు చేసే తరహాలో సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక రుగ్మతగా మారిన కంటి సమస్యను దూరంచేయాలనే కృతనిశ్చయంతో 2018లోనే కంటి వెలుగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తు చేశారు.
తొలి విడుతలో రాష్ట్రవ్యాప్తంగా కోటీ 50 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తే, మూడొంతుల మంది కంటి జబ్బులతో బాధపడుతున్నారని నిర్ధారణ అయ్యిందని, 50 లక్షల మందికి కంటి అద్దాలు అందించినట్లు వివరించారు. ప్రస్తుతం రెండో విడుతలో 18 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేసేలా విస్తృత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 12 లక్షల పైచిలుకు మందికి స్క్రీనింగ్ నిర్వహించేందుకు 70 బృందాలను ఏర్పాటు చేశామని, 100 రోజుల పాటు ఈ శిబిరాలు అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో కొనసాగుతాయని చెప్పారు. శారీరక అవయవాలన్నింటిలో అతి ప్రధానమైన కంటి చూపును కోల్పోతే ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించుకునేలా చొరవ చూపాలన్నారు. అన్ని వర్గాల వారు భాగస్వాములై కంటివెలుగును విజయవంతం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మంత్రి పిలుపునిచ్చారు.
అంధత్వ రహిత తెలంగాణ కోసం..: ఎమ్మెల్యే బిగాల
అంధత్వ రహిత తెలంగాణ కోసమే కంటి వెలుగు కార్యక్రమమని, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని 13 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని: జడ్పీ చైర్మన్ విఠల్రావు
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు తెలిపారు.
20 రోజుల్లో ఇంటికే కళ్లద్దాలు: కలెక్టర్ నారాయణరెడ్డి
జిల్లాలో 12.30 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు 70 బృందాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్, నగర మేయర్ దండు నీతూకిరణ్, నోడల్ అధికారి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త సంచాలకుడు అంబర్సింగ్నాయక్, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర మ హిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, కార్పొరేటర్లు శ్రీనివాస్ ఉమారాణి, దండు శేఖర్, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.