నందిపేట్: ప్రతి పాఠశాల ఆవరణతో పాటు తరగతిగదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావ్ సూచించారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆదివారం తనిఖీ చేశారు. పాఠశాల వరండా, తరగతిగదుల్లో శానిటైజేషన్ చేశారు. అలాగే ఆవరణను పరిశీలించి చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడులు ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ కొనసాగించాలని చెప్పారు.
ప్రతి విద్యార్థి మాస్కు ధరించడంతో పాటు ఒకరికి మధ్య దూరం పాటిస్తూ తరగతులు జరిగేలా చూడాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ దవాఖానకు సమాచారం అందించి వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. అలాగే తరగతి గదులను పరిశీలించి ఆయా సూచనలు, సలహాలు అందించారు. అలాగే నందిపేట్ ఆదర్శ పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని నందిపేట్ జెడ్పీటీసీ యమున కోరగా జెడ్పీ చైర్మన్ విఠల్రావ్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామారావ్, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.