ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్ల పంపిణీ
కామారెడ్డి, ఫిబ్రవరి 13:పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కామారెడ్డి సమీకృత కలెక్టరేట్ భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు త్వరలోనే ఎన్సీడీ కిట్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పీహెచ్సీల్లో పని చేస్తున్న వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు మంత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులను పరిశీలించారు. జిల్లా ఏరియా దవాఖానలో కలియతిరుగుతూ రికార్డులను తనిఖీ చేశారు.
ప్రజారోగ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్లు, 4జీ సిమ్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రజారోగ్యంలో మొదటిస్థానంలో కేరళ, రెండో స్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో తెలంగాణ ఉందని తెలిపారు. ప్రథ మ స్థానం లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆపరేషన్లను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లు తెలిపారు.
త్వరలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు త్వరలోనే ఎన్సీడీ కిట్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 22 మాతా శిశు కేంద్రాలకు ప్రభుత్వం రూ.407కోట్లు కేటాయించి, పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చురీల ఆధునీకరణకు రూ.32 కోట్లను విడుదల చేసిందన్నారు. పీహెచ్సీలో సక్రమంగా పనిచేయని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశ కార్యకర్తలను గుర్తించి అడుగకముందే సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 27వేల మంది ఆశ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు రూ.1500 మాత్రమే ఇచ్చేవారని, స్వరాష్ట్రంలో రూ.9750 ఇస్తున్నట్లు తెలిపారు. పనిచేసే వారిని ప్రభుత్వం గుర్తిస్తుందని, దీనికి ఆశ కార్యకర్తలే నిదర్శనమన్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సేవలను మరింతగా పెంచుతూ ముందుకు సాగుతున్నామన్నారు.
సెల్ఫోన్లు అందించడంతో ప్రతిరోజూ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, డెలివరీ, మందుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు. టెక్నాలజీ వినియోగంతో మెరుగైన వైద్యసేవలు అందించడానికి వీలుంటుందన్నారు. ఏఎన్ఎంలకు ఐపాడ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా ఉధృతి సమయంలో చాలా కష్టపడ్డారని అభినందించారు. మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్న జిల్లాల్లో కామారెడ్డి కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో ట్యాబ్లెట్లు అందించడంతోపాటు వాటిని వేసుకునేలా చొరవ చూపాలన్నారు. సాధారణ ప్రసవాలు జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించే బాధ్యత ఆశ కార్యకర్తలు, డాక్టర్లు, ఏఎన్ఎంలపై ఉందన్నారు.కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 61శాతం ఆపరేషన్లు, 39 శాతం మాత్రమే నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నదని నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో మొదటి డోస్ వందశాతం, రెండో డోస్ 83శాతం పూర్తయ్యిందన్నారు. పీహెచ్సీల వారీగా పెండింగ్ లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని డాక్టర్లకు సూచించారు. కలెక్టర్లు చొరవతీసుకొని వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలన్నారు. పీహెచ్సీలకు రూ.5లక్షల చొప్పున విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, వైద్యారోగ్య కమిషనర్ వాకాటి కరుణ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, పద్మాదేవేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యలపై మంత్రికి వినతి
జిల్లా కేంద్రంలో పెండింగ్లో ఉన్న వైద్యరంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ..మంత్రి హరీశ్రావును కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. పట్టణంలో నిర్మిస్తున్న మాతాశిశు కేంద్రానికి రూ.10 కోట్లను కేటాయించి 3,4 నెలల్లో పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు 350 పడకలు అవసరమైన నేపథ్యంలో మరో 150 పడకల దవాఖానను విప్ కోరగా అందుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కామారెడ్డిలో రూ. 3కోట్ల వ్యయంతో పాథలాజికల్, రేడియోలాజీ ల్యాబ్లను త్వరలో పూర్తిచేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో మార్చురీ ఆధునీకరణకు రూ.48.50లక్షలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరుచేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు స్థలాన్ని త్వరలో ఎంపిక చేసి నిర్మాణ పనులను చేపడుతామన్నారు.
ఏరియా దవాఖానను సందర్శించిన మంత్రి
విద్యానగర్, ఫిబ్రవరి 13: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కేంద్రంలో ఆదివారం పర్యటించారు. ముందుగా పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. అనంతరం ఏరియా దవాఖానను సందర్శించారు. సూపరింటెండెంట్ చాంబర్లోకి వెళ్లి రికార్డులను పరిశీలించి, కలెక్టర్తోపాటు వైద్యాధికారులతో చర్చించారు. రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల మాతా శిశు సంరక్షణ దవాఖాన భవనాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.