భీమ్గల్/డిచ్పల్లి/జక్రాన్పల్లి/వర్ని/నందిపేట్/ ఆర్మూర్, అక్టోబర్ 2 : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజు మద్దతు పెరుగుతున్నది. సబ్బండ వర్గాలు అభివృద్ధికి పట్టం కడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి. గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతున్న బీఆర్ఎస్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలోనే చేసి చూపిన గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. గ్రామాల్లో తీర్మానాలు జోరందుకోవడంతో నోటిఫికేషన్ విడుదలకు ముందే ఎన్నికల సందడి నెలకొన్నది.
బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. సబ్బండ వర్గాలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ ముక్త కంఠంతో నినదిస్తున్నారు. తాజాగా భీమ్గల్ మండలంలోని మెండోరా విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన 36 కుటుంబాలు, గౌడ సంఘానికి చెందిన 40, ముచ్కూర్ రజక సంఘానికి చెందిన 65 కుటుంబాలు మంత్రి వేముల వెంటే ఉంటామంటూ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేసి మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీటీసీ చౌట్పల్లి రవికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ మునుపెన్నడు లేసి విధంగా మండలాన్ని అభివృద్ధి చేసిన మంత్రి వేములకు అండగా ఉంటామని, రాబోయే న్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు రాజేందర్, బండి జ్యోతి, ఉపసర్పంచులు జలంధర్,భూమేశ్వర్ బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు రాంచందర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ శాలివాహన కుమ్మరి సంఘ సభ్యులు స్పష్టం చేశారు. సోమవారం బాజిరెడ్డి గోవర్ధన్కు తీర్మాన కాపీని అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపి ఆయనకు భారీ మెజారిటీ దక్కేలా గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ పోతర్ల సుజాతా రవి, శాలివాహన సంఘం అధ్యక్షుడు పోతుగంటి గంగాధర్, కార్యదర్శి పెద్ద భూమన్న, కోశాధికారి గంగానర్సయ్య, స్వరూప, శ్రీకాంత్, రజిత, గంగాసాయిలు, శ్రీధర్ తదితరులున్నారు. జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామ గంగపుత్ర సంఘానికి చెందిన 23 కుటుంబాల సభ్యులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెన్నంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుకన్యా ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్కు మద్దతుగా
వర్నిలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి సోమవారం మండల కేంద్రంలోని పలు కుల సంఘాల వారు ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు. మండల కేంద్రం లోని వడ్డెర, ముదిరాజ్, ఆర్యవైశ్య సంఘం, గౌడ కులస్తులు, విశ్వ బ్రాహ్మణులు, నాయీబ్రహ్మణులు, మున్నూరు కాపు కులస్తులతో పాటు జలాల్పూర్ గ్రామానికి చెందిన గూండ్ల కులస్తులు ఏకగ్రీవ తీర్మానాలను అందజేశారు.
జీవన్రెడ్డికి మద్దతుగా..
నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలోని రెండు మున్నూరుకాపు సంఘాలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. బైనవారి పంత, అయిలి వారి పంత రెండు సంఘాలు ఈ మేరకు తీర్మానాలు చేశాయి.
రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.
ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామానికి చెందిన మాదిగ సంఘానికి చెందిన 60 కుటుంబాలు బీఆర్ఎస్ తమ పూర్తి మద్దతు తెలుపుతూ సోమ వారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి.