బాన్సువాడ : మత్స్యకారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని పోచారం , నాగారం, ఇబ్రహీంపేట్ , హన్మాజీపేట్ , తిర్మలాపూర్ , సంగోజీపేట్, సోమేశ్వర్ గ్రామాలలోని మత్స్యకారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి చేప పిల్లలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మత్స్యకారులు దళారుల చేతిలో మోసపోయేవారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగు పడ్డాయని తెలిపారు.
వర్షాలు పుష్కలంగా కురియడంతో చెరువులు, ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగులు దుంకుతున్నాయన్నారు. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో వందశాతం రాయితీపై చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, బుడ్మి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ , ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామ్రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ , సర్పంచులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.