ఖలీల్వాడి/విద్యానగర్, జనవరి 26: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై కీలకోపన్యాసం చేశారు. జిల్లా అధికారులు, పురప్రముఖులను కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను తిలకించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ న్యూ కలెక్టరేట్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు చెందిన బాలబాలికలు మేరా భారత్ మహాన్ గేయంపై చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. వందేమాతరం గేయంపై వసుధా ఇంపీరియల్ పీపుల్ స్కూల్ విద్యార్థులు, ధరణీ దండాలమ్మ గీతంపై అభ్యాస హైస్కూల్ చిన్నారులు, ‘శాంతినికేతన గీతం.. ఇది సబర్మతీ సంకేతం’ గేయంపై విజయ్ హైస్కూల్ బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. ఇందల్వాయి కేజీబీవీ విద్యార్థినులు ‘చూడాచక్కని తల్లి… చుక్కల్లో జాబిల్లి’ జానపద గేయంపై చేసిన నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్తోపాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.