నస్రుల్లాబాద్, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీ పాల్య విఠల్ అన్నారు. నస్రుల్లాబాద్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ మేళాలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియం 1 నుంచి 5వ తరగతులకు బోధించే 56 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలోని పిల్లలకు తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం విషయాల్లో బోధించే బోధనాభ్యాసన సామగ్రిని నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, తహసీల్దార్ భావయ్య, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, మండల విద్యాధికారి నాగేశ్వర్రావు, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు గునిగెరి హన్మాండ్లు, నాయకులు ప్రతాప్సింగ్, వెంకటరమణ, మైశాగౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్లో..
బీర్కూర్, జనవరి 3 : మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బోధన, అభ్యాసన సామగ్రి మేళాను ఎంపీపీ రఘు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభంగా విద్యను బోధించేందుకు ఉపయోగపడే మండల సామగ్రి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కన్వీనర్ అవారి గంగారాం, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్రావు, ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారులు రాధాకృష్ణ, స్వరాజ్యలక్ష్మి, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ దుంపలరాజు, ఉపాధ్యాయులు రవీందర్జెట్టి, శివరాం, శ్రీనివాస్, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామారెడ్డిలో..
రామారెడ్డి, జనవరి 3: రామారెడ్డిలోని బాలికల పాఠశాలలో మంగళవారం టీఎల్ఎం మేళాను నిర్వహించారు. మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టులపై ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డీఈవో రాజు సందర్శించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకించి వారిని ప్రశంసించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. వారిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. పలువురికి ఎంఈవో యోసెఫ్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, సర్పంచ్ సంజీవ్, జడ్పీటీసీ నారెడ్డి మోహన్రెడ్డి, మండల నోడల్ అధికారి గోవర్ధన్రెడ్డి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు రాజులు, బస్వరాజు, బాలికల పాఠశాల హెచ్ఎం లింగాపురం బాల్రాజు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బాల్కిషన్, రామారెడ్డి ఉపసర్పంచ్ పోతునూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పిట్లం, ఎల్లారెడ్డిలో..
పిట్లంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నేడు (బుధవారం) మండలస్థాయి బోధన కృత్యాల మేళాను నిర్వహించనున్నట్లు ఎంఈవో దేవీసింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తాము రూపొందించిన ప్రాజెక్టులతో మేళాలో కార్యక్రమంతో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, ఉపాధ్యాయులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఎల్లారెడ్డి మండల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో బోధనోపకరణాల మేళా బుధవారం ఏర్పాటు చేసినట్లు ఎంఈవో వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఉదయం పది గంటలకు మేళా ప్రారంభమవుతుందని పేర్కోన్నారు. ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలని కోరారు.