అన్నంపెట్టే కర్షకులను ఉగ్రవాదులతో పోల్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అన్నదాతలను ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోలుస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అర్వింద్.. మూడేండ్లు దాటినా పట్టించుకోక పోవడంతో రైతులు అడుగడుగునా నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇస్సాపల్లి నిలదీసిన రైతులపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించడం, రైతులు తిరగబడడం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్రావు తదితరులతో కలిసి సంజయ్ నందిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా రైతులను ఖలిస్థానీ ఉగ్రవాదులతో పోల్చారు. బండి వ్యాఖ్యలపై పసుపు రైతులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
-నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసు పు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్పై రాసి చ్చి మరీ హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్.. మూడేండ్లుగా దాని ఊసే ఎత్తకపోవడంపై ఆర్మూర్ ప్రాంత పసుపు రైతులు ఆగ్రహం తో ఉన్నారు. బోర్డు హామీపై, పసుపునకు మద్దతు ధర దక్కకపోవడంపై వారు కొం తకాలంగా అర్వింద్ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గత ఏడాది జనవరి 23న కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో అర్వింద్ను నిలదీశారు. డిసెంబర్ 26న ఇందల్వా యి మండలం గన్నారం వద్ద ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన రైతులపైకి ఎంపీ అర్వింద్ వాహనాన్ని తీసుకెళ్లేందు కు ప్రయత్నించగా, ఓ మహిళా హోంగార్డు తీవ్రం గా గాయపడ్డారు. మంగళవారం నందిపేట పర్యటనకు వచ్చిన ఆయన కాన్వాయ్ని ఇస్సాపల్లి వద్ద రైతులు అడ్డుకోగా, వారిపైకి అదే తరహాలో వాహనంతో దూసుకెళ్లే ప్రయత్నం చేయడం కర్షకుల ఆగ్రహానికి కారణమైంది. అర్వింద్కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయగా, బీజేపీ కార్యకర్తల వారిపై దాడికి యత్నించారు. దీంతో తిరుగబడిన రై తులు వారి వెంటపడ్డారు. కాన్వాయ్పైకి రాళ్లు, కర్రలు విసిరారు. రై తుల దాడిలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఇస్సాపల్లి ఘటనలో గాయపడిన బీజేపీ కార్యకర్తల్ని పరామర్శించే పేరిట బండి సంజయ్ మందీమార్బలంతో ఆర్మూర్ ప్రాంతంలో గురువారం పర్యటనకు వచ్చారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్రావు, వివిధ జిల్లాల నేతలు సంజయ్ వెంట ఉన్నారు.
ఖలిస్థాన్ కామెంట్లు వ్యూహాత్మకమేనా?
రైతుల్ని ఉగ్రవాదులతో పోల్చడం, నిరసనను ఖలిస్థాన్ ఉగ్రవాదుల దాడితో పోల్చడం.. బీజేపీ నేతలు వ్యూహాత్మకంగానే చేసినట్లు అర్థమవుతున్నది. గురువారం నందిపేటకు వెళ్లడానికి ముందు ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. సంజయ్ నోరుజారలేదని, నాయకులంతా అదే వైఖరితో ఉన్నారని, అందుకే ఉద్దేశపూర్వకంగా ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చారని స్పష్టమవుతున్నది.
దళిత ఐపీఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజును కించపరుస్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ దళిత ఐపీఎస్ అధికారిని దూషిస్తూ మాట్లాడడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న పోలీసులపై ఆరోపణలు చేయడం తగదంటూ సూచిస్తున్నాయి. మంగళవారం రైతులపై ఎంపీ అర్వింద్, బీజేపీ నాయకులు చేసిన దాడిలో పోలీసులతోపాటు రైతులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎంపీ అర్వింద్ను కారు నుంచి కాలు బయట పెట్టనీయకుండా పోలీసులే రక్షణగా నిలిచారు. ఆర్మూర్ ఏసీపీ రఘు నేతృత్వంలో దాదాపుగా 100 మంది బందోబస్తు నిర్వహించారు. పోలీసులు పర్యటన వాయిదా వేసుకోవాలంటూ వారించినా, వారి మాట పెడచెవిన పెట్టిన అర్వింద్… మొండిగా ఇస్సాపల్లి పర్యటనకు వెళ్లారు. గురువారం బండి సంజయ్ సైతం ఆర్మూర్, నందిపేట పర్యటనకు పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు భారీ బందోబస్తును నిర్వహించారు. ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీసీపీ డా.వినీత్, ఇద్దరు ఏసీపీలు, 12మంది సీఐలు, లోకల్ ఎస్సైలతో పాటు అదనంగా 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఏడో బెటాలియన్ నుంచి 4 ప్లాటూన్, 3 స్పెషల్ పార్టీ బృందాలతో భద్రత కల్పించారు.
పసుపు బోర్డుపై మాట రాదేమి..?
2019 సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ పోటీ చేశాడు. రైతుల మద్దతుతో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష గెలుపు ఖాయం కావడంతో దొడ్డి దారిలో అసంబద్ధ, అసత్యపు, దుష్ప్రచారాలతో బీజేపీ కుట్రలకు పాల్పడింది. 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో అధికారం చెలాయించిన బీజేపీ పార్టీయే పసుపు బోర్డుపై నోరెత్తలేదు. ఎంపీగా కవిత డిమాండ్ చేస్తే స్పందించలేదు. అలాంటిది 2019లో ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామంటూ ధర్మపురి అర్వింద్ రైతులకు హామీ ఇచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ మీడియా ముందు, సమావేశాల్లో, ప్రచారాల్లో ఇదే విషయాన్ని వందల సార్లు చెప్పాడు. అంతేకాకుండా రైతులను నమ్మించేందుకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. తీరా ఎన్నికల్లో గెలిచాక ముఖం చాటెయ్యడంతో ఎంపీ అర్వింద్ను మూడేండ్లుగా పసుపు రైతులు నిలదీస్తున్నారు. నందిపేటలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రైతులది నిలదీసే తత్వమని చెప్పారు. మొన్న ఇస్సాపల్లిలోనూ అదే జరిగిందనే విషయాన్ని బండి మర్చిపోవడం విడ్డూరం. అర్వింద్ను నిలదీస్తున్న క్రమంలోనే బీజేపీ శ్రేణులు దాడులు చేయడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన రైతన్నలంతా ఎంపీని తరిమికొట్టగా బండి సంజయ్ మాత్రం విక్రభాష్యం చెప్పి జారుకోవడం కొసమెరుపు.
వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న రైతులు
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్మూర్ పసుపు రైతులను ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘పంజాబ్లో ప్రధాని నరేంద్రమోదీని అడ్డుకున్న రైతులంతా ఖలిస్థాన్ ఉగ్రవాదులమని చెప్పుకున్నారని… ఇప్పుడు ఆర్మూర్లో అర్వింద్ను అడ్డుకున్న రైతులు కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదుల్లాగా టీఆర్ఎస్ నాయకులని చెప్పుకుంటారా?’ అంటూ పొంతన లేని మాటలు మాట్లాడి ఉగ్రవాదులతో పోల్చడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారతదేశంలో ఆర్మూర్ ప్రాంత రైతులకు మంచి పేరుంది. ఇక్కడి రైతులు కష్టజీవులు. వీరు రాజకీయాలకు దూరంగా ఉంటారు. తమ అవసరాలు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డెక్కి తమ డిమాండ్లను ప్రశ్నిస్తారు. అలాంటి రైతులను పట్టుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దేశంలో నాణ్యమైన పసుపు పంటను పండించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ ప్రాంత రైతులను ఉగ్రవాదులతో పోల్చడం ఏంటంటూ రైతులు మండిపడుతున్నారు.
రైతు ఐక్యవేదిక ముసుగులో కమలం కండువాలు!
ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఎంపీ అర్వింద్ ఎదుట నిరసన తెలిపింది పసుపు రైతులు కాదని.. టీఆర్ఎస్ నాయకుల పనేనంటూ రైతు ఐక్యవేదిక ప్రతినిధుల పేరిట వెలువడిన ప్రకటనల్లోని అసలు గుట్టు బయటపడింది. దాడిని ఖండించిన రైతు ఐక్యవేదిక ప్రతినిధుల అసలు రూపాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పల్లపు వెంకటేశ్ బట్టబయలు చేశారు. ఈమేరకు గురువారం తగిన ఆధారాలతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్మూర్లో జరిగిన పసుపు రైతుల నిరసనను దాడిగా అభివర్ణించిన సంతోష్రెడ్డి, వెంకట్రెడ్డి బీజేపీ నాయకులని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు పంపించారు. రైతు ఐక్యవేదిక నాయకులమని, బీజేపీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తున్నదని పల్లపు వెంకటేశ్ పేర్కొన్నారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పసుపు రైతుల ముసుగులో ఎవరు రాజకీయం చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో రైతులకు హామీనిచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా చేస్తున్నదెవరో గ్రహించాలని సూచించారు. ఆర్మూర్ ప్రాంత రైతులతో రాజకీయం చేసింది ఎంపీ ధర్మపురి అర్విందా..? లేక ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డినా..? ఎవరో ప్రజలే గమనించాలని ప్రకటనలో పల్లపు వెంకటేశ్ పేర్కొన్నారు.
రైతు ఆగ్రహిస్తే మసైపోతారు..
మిస్టర్ అర్వింద్ పసుపుబోర్డు ఏమైంది. ఐదు రో జుల్లో తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసిచ్చిన సం గతి మర్చిపోయావా. ఏండ్లు గడిచిపోతున్నయ్. పసుపుబోర్డు తేలేని దద్దమ్మవు. రైతులను ఉగ్రవాదులంటారా.. రైతుల జోలికి వచ్చినోడికి పుట్టగతులుండవు. గుర్తుపెట్టుకో దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆగ్రహిస్తే మసైపోతావు జాగ్రత్త.
-బొంతల శేఖర్రావు, రైతు మాదాపూర్
ఎంపీ పదవికి రాజీనామా చెయ్..
పసుపు బోర్డు కోసం రైతులు నిరసన తెలిపితే వాహనాలతో తొక్కిస్తానని హెచ్చరిస్తావా..రైతులు పసుపుబోర్డు తేవాలని ప్లకార్డులతో నిరసన తెలిపితే బీజేపీ కార్యకర్తలతో దాడి చేయించడం సిగ్గుచేటు కాదా.. ఎంపీ అర్వింద్ ఇప్పటికైనా రైతులకు భేషరతుగా క్షమాపణలు చెప్పు. పసుపు బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
-రోడ్డ సుమన్, రైతు మాదాపూర్
టెర్రరిస్టులతో రైతులను పోలుస్తావా..?
నందిపేట, జనవరి 27: రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి రైతులను ఖలిస్థాన్లతో పోలుస్తావా.. ఇది సమంజసం కాదు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఎవరితో పోల్చి మాట్లాడుతున్నావ్. రైతులను గౌరవించడం నేర్చుకో.. రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్లకు రైతులు తగిన గుణపాఠం చెబుతారు.
-పెర్కిట్ సాయారెడ్డి, రైతు, తల్వేద
నోరెలా వచ్చింది..
ఎంపీ అర్వింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకురాలేదని అడిగితే బీజేపీ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకు చూస్తున్నరు. ఖలిస్థాన్ ఉగ్రవాదులతో రైతులను పోల్చడానికి నోరెలా వచ్చింది. రైతుల జోలికి వస్తే ఊరుకునేదే లేదు.
-సంటోళ్ల్ల శ్రీనివాస్ రెడ్డి, రైతు, తల్వేద
మాయమాటలు చెప్పి తప్పించుకోవద్దు..
బీజేపోళ్లు మాయమాటలు చెప్పి తప్పించుకోవద్దు. ఇన్ని మాట్లాడే కన్నా కేంద్రపోళ్ల దగ్గరికి పో యి పసుపుబోర్డు తీసుకురండి. అప్పుడు మీకు మద్దతుగా నిలుస్తం. అంతేగాని ఖలిస్థాన్లతోని ఇక్క డి రైతులకు ముడిపెట్టడం కరెక్టు కాదు. పద్ధతి మార్చుకోవాలె. దేశానికి అన్నం పెట్టేది ఈ రైతులేనని మర్చిపోవద్దు.
-గొజ్జి చిన్న గంగారాం, రైతు, వెల్మల్