నిజామాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇక్కడి పురోగతిని చూసి, ఉపాధి కోసం వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో ఉపాధి దొరకక మనవాళ్లు వలస పోయే దుస్థితి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ దార్శనికతతో పరిస్థితి మారింది. ఉత్తరాది రాష్ర్టాల నుంచి వేలాదిగా తెలంగాణకు వలస వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పలు రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం కారణంగా పరిశ్రమలు మూతబడి అక్కడి వారికి ఉపాధి కరువైంది. కానీ, తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పురోగమిస్తున్నాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలసలు భారీగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్ తదితర రాష్ర్టాల నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తున్నారు. ప్రగతి పరుగులు తీస్తున్న తెలంగాణే తమకు అన్నం పెడుతున్నదని వారంతా చెబుతున్నారు.
బిజిలీ నహీ… కామ్ నహీ… నిజామాబాద్లో బతుకుదెరువు కోసం వచ్చిన ఉత్తరాది పౌరుల మాటలివి. ఎవరిని కదిలించినా వారి నోట ఇప్పుడిదే వినిపిస్తోంది. ప్రగతి పరుగులు తీస్తున్న తెలంగాణే తమకు అన్నం పెడుతున్నదని వారంతా సగర్వంగా చెప్పుకుంటున్నారు. సొంత రాష్ర్టాల్లో గడ్డు పరిస్థితులను తలచుకొని భయాందోళనకు గురవుతున్నారు. ఏ కాలమైనా, ఏ పని చేసుకొనైనా తెలంగాణలో బతుకొచ్చనే నమ్మకం వారి కండ్లలో కనిపిస్తున్నది. పొట్ట కూటి కోసం సుదూరాల నుంచి బతుకు జీవుడా అనుకుంటూ మన రాష్ర్టానికి వచ్చి సంతోషంగా జీవిస్తున్నారు.
దేశమంతా ప్రధాని మోదీ అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలతో విద్యుత్ సంక్షోభం ఆవరించింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఏలుతున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్తోపాటు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంట్ లేక విలవిల్లాడుతున్నారు. ఫలితంగా అక్కడి పరిశ్రమలు మూతపడుతున్నాయి. పవర్ హాలిడే ప్రకటించుకుంటున్నాయి. దినసరి కూలీలపై ఆధారపడి జీవిస్తున్న వారంతా బీజేపీ ప్రభుత్వాల నిస్సహాయతతో బతకలేక సామాన్య జనానికి తెలంగాణ చుక్కానిలా కనిపిస్తున్నది. ముల్లే, మూట సర్దుకొని తెలంగాణ వైపు పయనం అవుతున్నారు. ఇక్కడి ప్రగతి, నిరంతర కరెంట్ను చూసి వారంతా అవాక్కవుతున్నారు.
కూలీ గిట్టుబాటు భళా…
ఉత్తరాది కూలీలకు తెలంగాణలో నిరంతరం పని దొరుకుతున్నది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత పని లభిస్తుండడంతో చాలా మంది స్వ రాష్ర్టానికి వెళ్లడానికి జంకుతున్నారు. సీజన్కు సంబంధం లేకుండా నిరంతరం ఏదో ఒక పని లో నిమగ్నమై రోజుకు రూ.వేయి వరకు సంపాదిస్తున్నారు. పురుషులకైతే రూ.వేయి, మహిళలకైతే రూ.500 నుంచి రూ.800 వరకు కూలీ గిట్టుబాటు అవుతున్నదని బిహారీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన కూలీలు చెబుతున్నారు. వ్యవసాయ రంగం విప్లవాత్మక మార్పులతో దూ సుకుపోతున్న ఉమ్మడి జిల్లాలో ఉపాధికి ఢోకా లేకుండా పోయింది.
నాట్లు వేసే నాటి నుంచి కోతల దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. మీ సొంత రాష్ట్రంలో ఉపాధి లేదా? అక్కడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే ఘోరమైన జవాబులు వస్తున్నాయి. తమ రాష్ర్టాల్లో ప్రస్తుతం కరెంట్ సరఫరానే లేదని, తెలంగాణలో నిరంతరం కరెంట్ సరఫరా అవుతుండడం తమకు ఆశ్చర్యంగా ఉందన్నారు. విద్యుత్ కొరతతో పరిశ్రమలు నడవకపోవడంతో చాలా మంది తెలంగాణకు వలస వస్తున్నారని చెబుతున్నారు. గతంలో కుటుంబాలను వదిలేసి వచ్చేదని, ఇప్పుడు ఏకంగా కుటుంబాలతో వచ్చి నివసిస్తున్నట్లుగా వివరిస్తున్నారు.
డిమాండ్కు అనుగుణంగా సరఫరా..
దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఇంత దారుణంగా ఉన్న ప్రస్తుత దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే దేశ ముఖచిత్రంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. కొత్త రాష్ట్రమైనప్పటికీ సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విద్యుత్ రంగాన శిఖరాగ్రానికి చేరుకున్నది. కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తూ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు కొండంత నమ్మకం, విశ్వాసాన్ని కేసీఆర్ సర్కారు కల్పిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ఎండాకాలంలో విద్యుత్ డిమాండ్ 5.2 మిలియన్ యూనిట్లు నిర్దేశించగా 6 మిలియన్ యూనిట్లు వరకు సరఫరా అవుతున్నది.
కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 3.5 మిలియన్ యూనిట్ల కోటా నిర్దేశించగా ప్రజల వినియోగం పెరగడంతో రోజువారీగా వాడకం అవుతున్న విద్యుత్ రికార్డు స్థాయిలో గరిష్ఠంగా 5మిలియన్ యూనిట్లు నమోదు కావడం విశేషం. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడి తలసరి విద్యుత్ వినియోగం 1,836 యూనిట్లుగా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండగా.. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 40శాతం పెరిగిందంటే సామాన్యమైన విషయం కాదు.
ఉత్తరాది సంక్షోభం ఇదీ..
ఉత్తరప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలకు 15 గంటలు, పట్టణ ప్రాంతాలకు 19 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ మిగతా సమయం కోతలు విధిస్తున్నారు. యూపీలో 3వేల మెగావాట్స్ విద్యుత్ లోటు ఉన్నది. ఉత్తరాఖండ్లోని కాశీపూర్ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం మూత పడడంతో అక్కడి ప్రజలకు కోతల తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్లోనూ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడ రోజూ 5 నుంచి 8గంటల వరకు కోతలు విధిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆప్కు ప్రభుత్వం మారినప్పటికీ పంజాబ్లోని పాటియాల, లూథియానా, మొహాలి లాంటి పట్టణాల్లో సైతం గంటల తరబడి కరెంట్ కోతలు తప్పడం లేదు.
ఇవే కాకుండా బిహార్, జార్ఖండ్, కేరళ, ఢిల్లీ, ఈశాన్య రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర ఇలా ఎక్కడికెళ్లినా విద్యుత్ కోతలకు 42 డిగ్రీలకు పైబడిన ఎండలు తోడవ్వడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 50 మిలియన్ యూనిట్ల కొరతను ఎదుర్కొంటున్నది. తీర ప్రాంత ఉక్కపోత వాతావరణాన్ని విద్యుత్ లేమితో ఎదుర్కోలేక అక్కడి ప్రజలు హైదరాబాద్, ఇతర జిల్లాలకు పయనం అవుతున్నారు. దేశీయంగా ఏర్పడిన బొగ్గు కొరత పరిస్థితులను అంచనా వేయడంలో వైఫల్యం తదితర కారణాల రీత్యా విదేశీ బొగ్గును 10శాతం మేర వాడుకోవాలని థర్మల్ కేంద్రాలకు ఆదేశాలున్నాయి. దేశీయ బొగ్గు టన్నుకు రూ.4వేలు ఉండగా, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ బొగ్గు ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్నది.
సమయపాలన లేని కోతలు..
బోధన్ రూరల్, మే 21: మా రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. తాగు, సాగు నీటికి కరెంట్ సరఫరా లేకపోవడంతో కష్టాలు ఎదురువుతున్నాయి. ఏదైనా వ్యాపారం చేయాలన్నా కరెంట్తో ముడిపడి ఉండడంతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. కరెంట్ కోతలతో పరోక్షంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా సర్కార్ కూడా 24 గంటల కరెంట్ సరఫరా చేస్తే మా బతుకులు మారుతాయి.
– అబాద్, హమాలీ, బిహార్
కరెంట్ కోతలు అధికం
మాది బిహార్ రాష్ట్రంలోని ముజాఫర్పూర్ జిల్లా. మా జిల్లాలో కరెంట్ కోత లు ఉంటాయి. 12గంటల కరెంట్ సరఫరా ఉంటే మరో పన్నెండు గంటలు కరెంట్ ఉండదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాము . కరెంట్ పోతే ఇంట్లో బత్తీలు(కొవ్వొత్తులు) పెట్టుకొని రాత్రంతా గడుపుతాం. ఇక్కడ చూస్తే కరెంట్ బాగానే ఉంటుంది.
– చంద్రశేఖర్ సహాని, బిహార్