విద్యానగర్, మే 2;పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పేపర్ లీక్, మాస్కాపీయింగ్కు తావు లేకుండా సీసీ కెమెరాల నిఘాలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 34,918 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 222 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 22,413 మంది, కామారెడ్డి జిల్లాలో 12,505 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి రాష్ట్రవిద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పదోతరగతి హాల్ టికెట్లు, ముద్రించిన నామినల్ రోల్స్ స్కూళ్లకు చేరుకున్నాయి. విద్యార్థులు ప్రధానోపాధ్యాయులను సంప్రదించి హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు సూచించడంతోపాటు హాల్టికెట్లను www.bse. telanga na.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో 34,918 మంది విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలో 34,918 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 22,413 మంది, కామారెడ్డి జిల్లాలో 12,505 మంది ఉన్నారు. నిజామాబాద్లో 153, కామారెడ్డిలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో 60 ప్రభుత్వ, 9 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అరగంట ముందు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. మొదటి రోజు మాత్రమే 9.35 గంటల వరకు మరుసటి రోజు నుంచి 9.30 గంటలలోపు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. పరీక్షకు ఒక రోజు ముందుగా పరీక్షా కేంద్రాలను విద్యార్థులు సందర్శించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ప్రతి సెంటర్ వద్ద ఒక కానిస్టేబుల్ను నియమించనున్నారు.
మాసీ కాపీయింగ్కు అడ్డుకట్ట
ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా రాష్ట్ర విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.పదోతరగతి పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని నిర్ణయించారు.ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయనున్నారు.సీసీ కెమెరాను చీఫ్ సూపరింటెండెంట్ గదిలో ఉంచి సీల్ చేసిన ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేస్తున్నప్పుడు రికార్డు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి. ఫ్లయింగ్ స్కాడ్స్, రూట్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్కాడ్స్, ఇన్విజిలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్స్, జాయింట్ కస్టోడియన్ ఆఫీసర్స్, కలెక్టర్, అదనపు కలెక్టర్, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. వీరితోపాటు రెవెన్యూ, పోలీస్, వైద్య విభాగాల అధికారులు పరీక్ష నిర్వహణలో పాల్గొంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
సీసీ కెమెరాల వివరాలు
పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్, 30 మీటర్ల రేంజ్,180 డిగ్రీలు కవరు చేసేలా సీసీ కెమెరాలు ఉండాలి.
పరీక్షలు జరుగుతున్న రోజులన్నింటిలో రికార్డు చేసేలా ఏర్పాట్లు ఉండాలి.
సీసీ కెమెరాలను అద్దె లేదా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలి.
సీసీటీవీ ఫుటేజీ పర్యవేక్షణకు పాఠశాలల్లో మానీటర్లు ఏర్పాటు చేయాలి. సెంటర్లు ఉన్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సొంతంగా వీటిని ఏర్పాటు చేసుకోవాలి.ఇప్పటికే సీసీ కెమెరాలుంటే సక్రమంగా పనిచేసేలా చూడాలి.
ఆరు రోజుల సీసీటీవీ ఫుటేజీని చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీల్డ్ కవర్లో భద్రపరిచి సంబంధిత డీఈవోలకు అందజేయాలి.
సీసీటీవీ కెమెరాలను కొనడానికి లేదా అద్దెకు సమ కూర్చుకునేందుకు జిల్లా కలెక్టర్లకు నిధులు మం జూరు చేశారు.వాటిని వినియోగించుకోవచ్చు.
ఒక కెమెరాకు రోజుకు రూ.586 అద్దె లేదా ఒక్కోదానికి రూ.6,900 వెచ్చించి కొనవచ్చు.
ఏర్పాట్లు చేస్తున్నాం..
పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలను అద్దెకు తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్ కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తున్నాం.
–రాజు, కామారెడ్డి డీఈవో