బీబీపేట్, మే 18 : శాంతిభద్రతల కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ సోమనాథం అన్నారు. మండలంలోని మాందాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు లేని 130 బైకులు, 8 ఫోర్ వీల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. ఇటీవల ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి డెబిట్, క్రెడిట్కార్డులకు సంబంధించిన వివరాలను అడిగినా, లక్కీడ్రా పేరుతో డబ్బులు అడిగితే పంపవద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లోన్లు మంజూరయ్యాయని.. వివిధ రకాల యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలని చెబుతారని.. వాటిని ఇన్స్టాల్ చేసి వివరాలను నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులు సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయని వివరించారు. కార్యక్రమంలో సీఐలు తిరుపయ్య, శ్రీనివాస్, ఎస్సైలు సాయికుమార్, సుధాకర్, హైమద్, రాజు, భువనేశ్వర్, సంతోష్గౌడ్, నర్సయ్య, ఏఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.