ఎడపల్లి (శక్కర్నగర్), మే 18 : ఎడపల్లి మండలకేంద్ర శివారులోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు జేపీ మోర్గాన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో రెండు విభాగాల్లో ప్రతిభను చాటారు. ఇన్నోవేటివ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ సీన్స్ తదితర అంశాలపై ఆన్లైన్లో ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రథమ బహుమతి సాధించిన ఎడపల్లిలోని తెలంగాణ గురుకుల కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థినులకు సంస్థ ప్రతినిధులు నాలుగు ల్యాప్ట్యాప్లు, 25 బ్యాగులు, తాగునీటి బాటిళ్లు, దుస్తులను బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుహాసిని మాట్లాడుతూ.. తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పరీక్షలు నిర్వహించడంతోపాటు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన జేపీ మోర్గాన్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభిస్తామని, ఇందుకు దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు.
తమ గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర డైరెక్టర్ పవన్ రమణకుమార్, జిల్లా కన్వీనర్ తారాసింగ్, మాజీ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రావణ్, మధు, కళాశాల సిబ్బంది నాగరాణి, రేణుక, సంధ్య తదితరులు పాల్గొన్నారు.