నిజామాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్పై బుధవారం తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి గణాంకాలతో ఆయన వైఖరిని ఎండగట్టారు. ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తాలతో కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కవిత విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని మాటిచ్చి మూడేండ్లు గడిసిపోయిందని, బోర్డు ఏర్పాటుపై అర్వింద్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కవిత ప్రశ్నించారు. ‘ఇప్పటిదాంక ఓపిక పట్టినం. ఇక ఇడిసిపెట్టేది లేదు. మోదీ ముందు మోకాళ్లయాత్ర చేస్తావో. మోకరిల్లి తెస్తవో.. బాండ్పేపర్లో రాసిచ్చినట్లుగా పసుపుబోర్డు తేవాలి. లేదంటే అడుగడుగునా నిలదీస్తాం. ప్రశ్నిస్తాం’ అంటూ హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తొలిసారి ఎంపీ అర్వింద్పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి గణాంకాలతో ఎండగట్టారు. రైతులను మభ్యపెట్టి డ్రామా చేసుడు తప్ప బాండ్ పేపర్ ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటుకు చేసిందేమిటని ప్రశ్నించారు. 2019 నుంచి పసుపు రైతుల కోసం బీజేపీ ఎంపీ తెచ్చిన నిధులు రూ.2కోట్లు కూడా లేవన్నారు. లక్ష మంది రైతులకు పంచితే దేడ్ సౌ అంటే రూ.150 కూడా రావని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఇతర టీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాలను మీడియా సమావేశంలో కవిత ప్రదర్శించారు. స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్లో దుస్థితిపై ఫొటోలను చూపించారు. ఇంకా రెండేండ్ల పదవీకాలంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే అడుగడుగునా నిలదీస్తాం… ప్రశ్నిస్తామంటూ ఎంపీ అర్వింద్ను హెచ్చరించారు. మోదీ వద్ద మోకరిల్లుతావో, మోకాలి యాత్ర చేస్తావో పసుపు బోర్డు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ నాయకుడు రామ్మాధవ్, అర్వింద్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి నిజనిజాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
ప్రధానిని కలిశా…సీఎంలను ఒప్పించా…
2014 జూన్ నుంచి మొదలు పెడితే 2018 జూన్ వరకు పసుపుబోర్డు కోసం పోరాటం చేశా. ప్రధానంగా నాటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ప్రధానమంత్రి మోదీకి ఉత్తరం రాయడం, పసుపు బోర్డు ఏర్పాటుపై డిమాండ్ చేయడం, వేల్పూర్ మండలంలోని పడగల్లో స్పైస్ పార్కుకు నిధులు అడగడం, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేరళ ముఖ్యమంత్రిని, తమిళనాడు సీఎం జయలలిత, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసినట్లు కవిత వివరించారు. ఆగస్టు 25, 2016లో ప్రధాని నరేంద్ర మోదీని నిజామాబాద్ ఎమ్మెల్యేలతో మొదటిసారి కలిసినట్లు చెప్పారు. 2016లో పతంజలి ఆయుర్వేదిక్ ఉత్పత్తుల సంస్థ సీఈవో బాలకృష్ణను నిజామాబాద్కు తీసుకువచ్చినట్లుగా వివరించారు.
మార్చి 24, 2017న పార్లమెంట్లో ప్రైవేటు మెంబర్ బిల్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అసోంలో బీజేపీ సీఎంతోనూ లేఖ ఇప్పించినట్లు గుర్తు చేశారు. 2017లో మరోమారు పసుపు బోర్డు కోసం పీఎం నరేంద్ర మోదీని కలిసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 2017లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రానికి పంపిన లేఖ కాపీని చూపించారు. 2018లో వాణిజ్య మంత్రిగా పదవిలో ఉన్న సురేశ్ ప్రభును సైతం ఇదే విషయంపై పలు సందర్భాల్లో విన్నవించినట్లు చెప్పారు. పసుపు రైతులకు ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం, స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ పెట్టాలని రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎంపీగా తాను చేసిన కృషికి ఫలితంగానే 2015లోనే స్పైసెస్ బోర్డు ద్వారా ఫీల్డ్ ఆఫీస్, 2017లో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డివిజినల్ ఆఫీసును పెట్టినట్లుగా తెలిపారు. పసుపు రైతులకు బాయిలర్లు కావాలని అడిగితే కేంద్రం సహకరించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 250 బాయిలర్లను 50శాతం సబ్సిడీతో పంపిణీ చేశామన్నారు.
ఇకపై ఇడిసి పెట్టేది లేదు..
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని మూడేండ్ల కింద మాటిచ్చారు. ఇంకా రెండేండ్ల పదవీకాలం ఉంది. ఎప్పుడు తెస్తారో ప్రజలకు ఎంపీ అర్వింద్ జవాబివ్వాలని కవిత డిమాండ్ చేశారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఏమైందని ప్రశ్నించారు. ‘ఇకపై ఇడిసి పెట్టేది లేదు. అర్వింద్ మోకాళ్ల యాత్ర చేస్తారో.. మోకరిల్లి సాధిస్తారో చేయండి. బాండ్ పేపర్లో రాసిచ్చినట్లుగా పసుపు బోర్డు తేవాలి. లేదంటే అడుగడుగునా నిలదీస్తాం. ప్రశ్నిస్తాం’ అంటూ హెచ్చరించారు. పార్లమెంట్లో మూడేండ్లలో అర్వింద్ మాట్లాడింది ఐదుసార్లేనన్నారు. ఒక్కసారి కూడా పసుపు బోర్డు, పసుపు రైతుల మాట ఎత్తలేదన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి అధర్మపురి అర్వింద్ అంటూ కవిత వ్యాఖ్యానించారు.
2020 -21లో స్పైస్ బోర్డు ద్వారా వచ్చిన బడ్జెట్ రూ.1.18 కోట్లు, 2021-22లో రూ.74లక్షలు వచ్చింది. నిజామాబాద్లో లక్ష మంది పసుపు రైతులుంటే ఈ గొప్ప ఎంపీ సాధించింది రూ.2కోట్లు కూడా కాదు. రూ.1.92కోట్లు మాత్రమే సాధించుకొని వచ్చిండు. లక్ష మందికి ఈ డబ్బు పంపిస్తే జుట్టుకు(తలకు) దేడ్ సౌ(రూ.150) కూడా రాదంటూ నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్పై తీవ్రస్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ ప్రతి రైతునూ మభ్యపెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడమే కాకుండా ఆదుకునే పాపన పోలేదన్నారు. తెలంగాణలో రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50వేల కోట్లు బదిలీ చేసిందన్నారు. అనేక అబద్ధాలు చెప్పి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి, బీజేపీ అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు.
హైస్పీడ్ అబద్ధాలు..
బీజేపీ వాళ్లు హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ అత్తాపత్తా లేదన్నారు. సిలిండర్ ధర పెరిగిందంటే కట్టెల పొయ్యి పెట్టుకోమని బీజేపీ వాళ్లు మహిళలను అవమానపరుస్తున్నారని కవిత మండిపడ్డారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా అంశాల్లో టాప్ టు బాటమ్ అబద్ధాలాడే పార్టీ బీజేపీ అన్నారు.
కేంద్రంలో 15లక్షల ఖాళీలు భర్తీ చేయాలి..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అనవసరంగా వివాదం చేశారని, కేంద్రంలో 15 లక్షల ఖాళీలు పూర్తి చేయాలని ఎంపీకి హితవు పలికారు. దమ్ము, ధైర్యం ఉంటే నీ మోదీ కాళ్లు పట్టుకొని కేంద్రం లో ఉద్యోగాల భర్తీ చేపట్టేలా ఒత్తిడి తేవాలని కవిత డిమాండ్ చేశారు. అర్వింద్కు చిత్తశుద్ధి, బాధ్యత ఉంటే సిగ్గుతో తలదించుకునే సందర్భం ఒకటి ఉందని గుర్తుచేశారు. 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, 2 ఐఐఎస్సీఆర్లు, 16 ట్రిపుల్ ఐటీలు, 4 ఎన్ఐడీలు, 157 మెడికల్ కాలేజీలు, 84 నవోదయ విద్యాలయాలను కేంద్రం మం జూరు చేస్తే,అందులో తెలంగాణకు ఇచ్చింది గుండు సు న్న అని పేర్కొన్నారు. ముందు ఇవి తీసుకురా.. చేయాల్సినవి చేయకుండా, పోరాట క్షేత్రాన్ని వదిలేసి ప్రజల్లో ఏదేదో మాట్లాడడం కాదంటూ అర్వింద్పై మండిపడ్డారు.
ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
మండలంలోని చౌడమ్మకొండూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కవిత బుధవారం పరిశీలించారు. సుమారు కోటి రూపాయల పైచిలుకు సొంత నిధులతో చౌడమ్మదేవీ ఆలయ ఆవరణలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్మాణ పనులను చేపట్టారు. మొదట చౌడమ్మదేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తిచేసి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టాలని గ్రామస్తులకు ఎమ్మెల్సీ సూచించారు. కుద్వాన్పూర్లో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు పాల్గొన్నారు. గ్రామస్తులంతా కలసికట్టుగా ఉండి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఎంపీపీ సంతోష్రెడ్డి, జడ్పీటీసీ ఎర్రం యమున, సర్పంచులు ప్రభాకర్రావు, సాగర్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర బలగాలు కొత్తేం కాదు..
తన రక్షణకు కేంద్ర బలగాలను సమకూర్చుకున్నట్లుగా ఎంపీ అర్వింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గిసుంటి కేంద్ర బలగాలను నాలుగేండ్లు ఎదుర్కొంది తెలంగాణ. ఇసుంటోళ్ల మాటలకు భయపడతమా? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నరు.. ప్రజాస్వామ్యంలో. కేంద్ర బలగాలతో మాపై దాడి చేస్తారా. దాడి చేసి బతికి బట్ట కడతారా? అంటూ ప్రశ్నించారు. చేయాల్సిన పనుల నుంచి బీజేపీ తప్పించుకొని ప్రజలను పక్కదారి పట్టిస్తుందన్నారు.