నాగిరెడ్డిపేట్, మే 4 : ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రిచవచ్చని ఎస్పీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన 33 సీసీ కెమెరాలను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలో 33 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
జిల్లాలో నాలుగు నెలల్లోనే 89 యాక్సిడెంట్లు..
జిల్లాలో నాలుగు నెలల్లోనే 89 యాక్సిడెంట్లు జరిగి వంద మంది మృతిచెందారని ఎస్పీ వెల్లడించారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో హెల్మెట్ లేకపోవడంతో ఎక్కువ మంది మృతి చెందుతున్నారన్నారు. నాలుగు నెలల్లో జిల్లావ్యాప్తంగా 13 హత్యలు జరిగాయని, 243 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పాత నేరస్తులను బైండోవర్ చేయడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుట్కాలు అమ్మినా, గంజాయి సరఫరా చేసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై ఆంజనేయులు, సర్పంచ్ వంజరి సునీత, ఎంపీటీసీ మాధవి, మాజీ జడ్పీటీసీ జయరాజ్ పాల్గొన్నారు.
త్రిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేకపూజలు..
నాగిరెడ్డిపేట్, మే 4 : మండంలోని తాండూర్ గ్రామంలో ఉన్న త్రిలింగ రామేశ్వర ఆలయంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి బుధవారం ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ చరిత్రను ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై ఆంజనేయులు, ఆలయ కమిటీ సభ్యలు ఉన్నారు.
తాగునీటి శుద్ధి యంత్రం ప్రారంభం..
లింగంపేట, మే 4: మండలంలోని మెంగారం గ్రామంలో తాగునీటి శుద్ధియంత్రాన్ని శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అందజేయగా.. ఎస్పీ శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో స్పీడ్ గన్లు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. సమాజసేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని, తన ఆదాయంలో 20 శాతం సమాజసేవకు ఖర్చు చేస్తానని చెప్పారు. పైడిఎల్లారెడ్డి, ఎస్పీ శ్రీనివాస్రెడ్డిని గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ముల మహేశ్, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డి, సీఐ శ్రీనివాస్, సహకార సంఘం వైస్ చైర్మన్ మాకం రాములు, ఉపసర్పంచ్ బాల సాయిలు, గన్నూనాయక్, బాలయ్య, తోట సాయిలు, నారాయణ పాల్గొన్నారు.